Narasapuram MPDO Venkataramana Missing Case : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాఫ్తు వేగవంతం చేశారు. ఏలూరు కాల్వలోకి వెంకటరమణ దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన మొబైల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో వెంకటరమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఎంపీడీవో వెంకటరమణ నిన్న (మంగళవారం రోజు) ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా మెసెజ్ పంపాడు. అందులో ‘ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా’ అంటూ రాయడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు - ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు - Action Against nandyal Police
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, వెంకటరమణారావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసముంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పని చేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి, తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా, ఫోన్ కూడా పని చేయలేదు.
అర్ధరాత్రి దాటాక ‘నా పుట్టిన రోజైన 16వ తేదీయే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త’ అని భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు విజయవాడ, మచిలీపట్నంలో గాలిస్తున్నారు.