Lokesh Helps Gulf Victims :బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు దగాపడ్డామనని ఓ పోస్ట్ పెడితే వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేశ్ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో సుమారు 20 మందిని స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
బాధితులకు అండగా లోకేశ్ : చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేకేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన చింతపర్తి శివ ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు కువైట్ వెళ్లారు. కనుచూపు మేరలో జనావాసాలే ఉండని ఎడారి ప్రాంతంలో గుర్రాలు, ఒంటెలు, కుక్కలు వంటి పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందించే పని తనకు ఇచ్చారు. అక్కడ తన కష్టాలను సెల్ఫోన్లో వీడియో తీసి రాష్ట్రంలో ఉన్న మిత్రులకు పంపారు. సోషల్మీడియా ద్వారా బాధితుడి కష్టాలు తెలుసుకున్న లోకేశ్ వెంటనే శివను స్వస్థలానికి రప్పించే ఏర్పాట్లు చేశారు.
ఎన్నారై టీడీపీ నేతల సహకారంతో : రాజానగరం మండలానికి చెందిన కొత్తపల్లి ప్రియాంక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన చిగురుపాటి బేబి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన నమిడి ప్రమీల, అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయారు. వీరి ఉదంతాలను వారి కుటుంబసభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న లోకేశ్ ఏపీఎన్ఆర్టీ , ఎన్నారై టీడీపీ నాయకులను అప్రమత్తం చేయడంతో వారు రంగంలోకి దిగి బాధితులను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఏపీఎన్ఆర్టీ, టీడీపీ, భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్నారై ప్రతినిధులు బాధితులు ఉన్న ప్రదేశానికి చేరుకుని ఎంబసీ సహకారంతో వారిని స్వదేశానికి పంపిస్తున్నారు.