Minister Komatireddy Review on Roads and Buildings : రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ రోడ్స్ ఫండ్ (సీఆర్ఎఫ్ నిధులు) తీసుకురావడం, సేతుబంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్సీలు గణపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీఈ మోహన్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖలో జోనల్, సర్వీసు రూల్స్పై కొన్ని సవరణలు చేయాల్సిన ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు. ఆర్ అండ్ బీ శాఖ సర్వీసు రూల్స్లో పదోన్నతుల్లో అన్యాయం జరిగిన అధికారులు, సిబ్బందికి న్యాయం చేసేందుకు శాఖాపరంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో వారం, పది రోజుల్లో ఆయా సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖను మంచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద రోడ్డు, ఇన్ని నిధులు అవసరమా? అన్న ప్రశ్నల నేపథ్యంలో హైదరాబాద్ చుట్టూ బాహ్యవలయ రహదారి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.