Kakinada Stella L Panama ship Issue:కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో తమకు చెందిన పారాబాయిల్డ్ రైస్ను లోడ్ చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీచిత్రా అగ్రి ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ కేవీ.భాస్కరరెడ్డి, పద్మశ్రీ రైల్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్యశ్రీ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ పోతంశెట్టి విశ్వనాథరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. బియ్యం రవాణా చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయా లేవా, నౌకలో బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటీ తదితర వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్ అభ్యర్థన మేరకు విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఉపముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో కాకినాడ పోర్టులో తమకు చెందిన పారా బాయిల్డ్ బియాన్ని బార్జ్ల నుంచి స్టెల్లా నౌకలోకి లోడ్ చేయకుండా కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ పోర్ట్ అధికారి అడ్డుకుంటున్నారని పేర్కొంటూ హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణలో ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సాంబశివప్రతాప్ స్పందిస్తూ పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలన్నారు.
ఈ వ్యాజ్యాలపై విచారణను గురువారం విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ బియ్యాన్ని లోడ్ చేయకుండా నౌకను నిలిపివేయడంతో ఒక్కో పిటిషనర్కు రోజుకు 4.20 లక్షల చొప్పున డెమరేజ్ ఛార్జి పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.