ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలా చేయకుంటే చర్యలు తప్పవు - బిల్డర్లకు హైడ్రా రంగనాథ్ హెచ్చరిక

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే బిల్డర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు - హైడ్రా ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా ప్రకటన విడుదల​

Hydra_100_Days
Hydra 100 Days (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Ranganath about Hydra 100 Days :తెలంగాణలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి హెచ్చరిక జారీ చేశారు. సర్వే నంబర్లు మార్చి తప్పుడు సమాచారంతో అనుమతులు తీసుకొని భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తప్పకుండా ఉంటాయని రంగనాథ్ తేల్చిచెప్పారు. అదే విధంగా హైడ్రా కూల్చివేతల తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయంలో పలువురు బిల్డర్లు, యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు రంగనాథ్ తెలిపారు. కొంతమంది నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తుండగా, మరికొంత మంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

హైడ్రా ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు హైడ్రా ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణలోని చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) ప్ర‌య‌త్నం చేస్తుందని అన్నారు. అయితే ఈ క్రమంలో త‌ప్పుడు ప్ర‌చారం చేసి ప్ర‌భుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం జరుగుతుందని ఆవేదన వెలిబుచ్చారు.

ప్ర‌భుత్వ అనుమ‌తులున్న భ‌వ‌నాల‌ను హైడ్రా కూల్చ‌దని రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అలాగే భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా టెండర్ల ద్వారానే పిలిచి అప్పగించామని అన్నారు. ఎర్రకుంట చెరువు ఎఫ్​టీఎల్​లోని (Full Tank Level) వ్యర్థాల్లో ఇనుప చువ్వుల తరలింపుపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. న‌గ‌రంలో ట్రాఫిక్, వ‌ర‌ద నీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి కూడా హైడ్రా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రంగనాథ్ తెలిపారు.

హైదరాబాద్ నగర సమస్యలపై హైడ్రా ఫోకస్ - వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే!

చెట్లు పరిరక్షణతోపాటు రహదారులపై దృష్టి :మరోవైపు నగరంలోని దాదాపు 100 చెరువుల్లో ఆక్రమణలు తొలగించి, సుందరీకరణ చేసి పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని చెరువులను సీఎస్‌ఆర్‌ పథకం కింద, మరికొన్నిహెచ్‌ఎండీఏ సొంత నిధులతో పర్యాటక ప్రదేశాలుగా మార్చనున్నారు. ఆక్రమణలు తొలగించడమే కాకుండా సుందరీకరణ చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని యోచిస్తున్నారు. చెరువుల సుందరీకరణకు సంబంధించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌కు ఇచ్చారు.

పూడికతీతతో పాటు చుట్టూ పచ్చదనం పెంచి పర్యాటక ప్రాంతాలుగా మార్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. బెంగళూరు తరహాలో చెరువులకు పునరుజ్జీవం పోయాలని హైడ్రా యోచిస్తోంది. చెట్ల పరిరక్షణతో పాటు ప్రధాన రహదారులు, కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను సైతం వెంటనే తొలగించాలని నిర్ణయించింది. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, అయినా కూడా ఇబ్బందిగా ఉంటే ఆ చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయాలని హైడ్రా నిర్ణయించింది.

హైడ్రా ఫోకస్​ వారి పైనే - ఇక దూసుకుపోనున్న వాహనాలు

ABOUT THE AUTHOR

...view details