తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా విల్లాలు నిర్మించి - రూ.300 కోట్లు దండుకున్న మహిళ - చివరకు? - HYDERABAD BUILDER ARREST

అక్రమంగా విల్లాలు కట్టి రూ.300 కోట్లు దోచుకున్న మహిళా బిల్డర్ - విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

Real Estate Fraud
Real Estate Fraud (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 7:19 AM IST

Real Estate Fraud : ఆమె అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్లను దోచేసుకుంది. చివరికి ఆ మహిళ చేసిన మోసం గుట్టురట్టవడంతో రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంది. కానీ పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండుకు తరలించారు.

ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నిజాంపేట బాలాజీనగర్‌కు చెందిన గుర్రం విజయలక్ష్మి శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌, భావన జీఎల్‌సీ క్రిబ్స్‌, శ్రీలక్ష్మి మాగ్నస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థలను ప్రారంభించింది. ఆమె 2018లో మల్లంపేటలోని 170/3, 170/4, 170/4ఏ సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టగా, మొత్తం 325 విల్లాల్లో కేవలం 65కు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చింది. మిగిలిన 260 విల్లాలకు పంచాయతీ అనుమతులు చూపించారు. ఇలా దాదాపు 260 విల్లాలను విక్రయించింది.

ఆమె కట్టిన విల్లాలన్నీ అక్రమమని 2021లో అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీశ్​కు ఫిర్యాదులు వెళ్లగా, ఆయన విచారణ జరిపారు. విచారణలో 201 విల్లాలను సీజ్‌ చేశారు. అయినా సరే విజయలక్ష్మి తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంది. అయితే వాటిలో స్థానిక కత్వ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మించిన 26 విల్లాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గతేడాది సెప్టెంబరులో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు గుర్తించారు. అదే నెలలో హైడ్రా ఆధ్వర్యంలో 15 విల్లాలను కూల్చేశారు.

మోసాల విజయలక్ష్మి :2021-24 మధ్య దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విజయలక్ష్మి మీద మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. 2024లో మల్లంపేటలోని సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిని కొంత ఆక్రమించి 5 విల్లాలను నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై ఆగస్టులో ఆర్‌ఐ ప్రదీప్‌ రెడ్డి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు స్థానికుల ఫిర్యాదు మేరకు మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఆమె దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఈ విషయం నిందితురాలికి తెలియడంతో అమెరికా వెళ్లేందుకు బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. పాస్‌పోర్టు, వీసా తనిఖీ సమయంలో ఆమెపై లుక్‌ అవుట్‌ నోటీసు ఉన్నట్లు ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిందిరాలు గుండెపోటు వచ్చినట్లు యాక్టింగ్‌ చేయడం గమనార్హం.

హైడ్రా ఎఫెక్ట్ - ఒక్క ప్రహరీ గోడ కూల్చివేతతో 20 కాలనీలకు తొలగిన ఇబ్బంది

మణికొండ వైపు దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు - నెక్నాంపూర్​లో 5 విల్లాలు నేలమట్టం

ABOUT THE AUTHOR

...view details