Free Electricity For SCs And STs Under Suryagarh Scheme:ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 20లక్షల 10 వేల విద్యుత్ కనెక్షన్లకు పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల పలకలు ఏర్పాటు చేయనుంది. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా చూడడంతో పాటు ప్రతి నెల కొంత మొత్తాన్ని లీజు రూపంలో ప్రభుత్వమే చెల్లించనుంది. దీనికి సంబంధించిన సర్వేను రాష్ట్రప్రభుత్వం పూర్తిచేసింది.
ప్రతినెలా కొన్ని దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. నిబంధన మేరకు కేంద్రం ఇచ్చే రాయితీ విడుదల చేసేందుకు అంగీకరించింది. వాటి నిర్వహణ బాధ్యతలను డిస్కంలకు అప్పగించాలని నిర్ణయించింది. వీటిద్వారా 2 వేల 412 మెగావాట్ల సౌర విద్యుత్ అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో పీఎం సూర్యఘర్ పథకం కింద నారావారిపల్లె సమీపంలోని ఎ.రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం పంచాయతీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా 25 ఇళ్లకు సౌరపలకలను అమర్చారు. గ్రామంలో ఈ పనులన్నీ ఉగాదిలోపు పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పలకలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా, మిగిలిన వారికి బ్యాంకు రాయితీ కింద రుణంగా ఇస్తున్నారు.