Fraud in The Name of Love And He motivated Her To Die in Guntur District : చదువుకునేటప్పుడు ప్రేమ పేరుతో యువతి వెంట పడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, తీరా వివాహం చేసుకోమని అడిగితే తాను ప్రభుత్వ ఉద్యోగినని ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించడం లేదని చెప్పాడు. చివరకు యువతి ఆత్మహత్యాయత్నం చేసుకునేలా ప్రోత్సహించాడు. దీనిపై బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ చదివింది. ఇంటర్ చదివే సమయంలో కారసాల రాజారావు అనే యువకుడు ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడి వేధించాడు. ఏదైనా ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాజారావుకు సచివాలయంలో ఉద్యోగం వచ్చాక ఇద్దరం జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఈ క్రమంలో ఆమె చదువుతున్న కళాశాల వద్దకు రాజారావు వెళ్లేవాడు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. 2024లో గుంటూరులోని ఓ క్లినిక్లో యువతి ఉద్యోగంలో చేరింది. అక్కడకు కూడా అతడు వచ్చేవాడు. యువతి పెళ్లి విషయం అడిగితే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున ఎక్కువ కట్నం వస్తుందని, తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు.
ఈ ఏడాది జనవరి 15న రాజారావు యువతి ఉద్యోగం చేస్తున్న క్లినిక్కు వెళ్లాడు. పెళ్లి విషయంపై ఇద్దరూ గొడవపడ్డారు. పెళ్లి చేసుకోకపోతే తనకు చావే గతి అని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రెండు ఎలుకల మందు పేస్టులు తెచ్చి యువతికి ఇచ్చాడు. అంతేకాక యువతి చేతిని చాకుతో కోశాడు. ఎలుకల మందు తిన్నాక తనకు మెసేజ్ పెట్టాలంటూ అక్కడి నుంచి రాజారావు వెళ్లిపోయాడు. యువతి ఎలుకల మందు తిన్నాక రాజారావుకు మెసేజ్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ప్రేమ- పెళ్లి! ఆ తరువాత వ్యభిచార కూపంలోకి
కాగా మెసేజ్ను అతడు యువతి బంధువైన మహిళకు పంపాడు. ఆమె విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం వారు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించారు. బాధిత యువతి జరిగిన ఘటనలను తల్లిదండ్రులకు చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రాజారావు తల్లిదండ్రులను ప్రశ్నించగా చంపుతామని బెదిరిస్తున్నారని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగేంద్ర చెప్పారు.
"అల్లరి ప్రియురాలు" చెల్లి ఫొటోతో చాటింగ్ - ఆరేళ్ల తర్వాత ఏమైందంటే!