తెలంగాణ

telangana

ETV Bharat / state

45 నిమిషాల్లో హైదరాబాద్ టు విజయవాడ - విమానంలో మాత్రం కాదు- మరి ఎలాగంటే?

సర్వం డ్రోన్ల మయం - ఇప్పటికే పలు రంగాల్లో సేవలు - భవిష్యత్తులో మరిన్ని విభాగాలకు విస్తరణ

SPECIAL FEATURES OF DRONES
Amaravati Drone Summit 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Amaravati Drone Summit 2024 :ఇక నుంచి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 45 నిమిషాల్లో రావచ్చు. అంత త్వరగా రావాలంటే అయితే హెలికాప్టర్ లేదా విమానంలో రావాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ రెండింటి గురించి కాదు. మరి ఈ రెండూ కాకుండా ఈ అంత తక్కువ సమయంలో ఇంత దూరం ఎలా ప్రయాణించగలం అని ఆలోచిస్తున్నారా? ఇంకెలాగా డ్రోన్‌లో! అదెలాగంటారా? ఈ హైదరాబాద్ టు విజయవాడ డ్రోన్ ప్రయాణం గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

డ్రోన్ల ప్రత్యేకతలు, పని తీరు : వ్యవసాయం, వైద్యం, రక్షణ వంటి పలు రంగాల్లో డ్రోన్ల సేవలు ఇప్పటికే అందుతుండగా సమీప భవిష్యత్తులో వాటి వినియోగం మరికొన్ని రంగాలకూ విస్తరించనుంది. మానవ కొరత ఉన్న రంగాల్లో డ్రోన్లు ఎలాంటి సేవలు అందిస్తాయో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంతమేర ఉంటాయి? ఇన్నాళ్లూ వివిధ రంగాల్లో ఉన్న అడ్డంకులను ఇవి ఎలా అధిగమిస్తాయి? సహాయచర్యలకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయి? ఇలాంటి అనేక విషయాలు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన డ్రోన్‌ సమిట్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

దేశంలోని నలుమూలల నుంచి డ్రోన్‌ తయారీదారులు ఈ సమిట్‌కు వచ్చారు. వారు తాము రూపొందించిన, దిగుమతి చేసుకున్న, అభివృద్ధి చేసిన డ్రోన్లను ప్రదర్శించారు. వీటిలో కొన్ని ప్రయోగాత్మక దశలో, మరికొన్ని పరీక్ష స్థాయిలో ఉన్నాయి. మిగిలిన చాలావరకు డ్రోన్లు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి. ఆయా డ్రోన్ల ప్రత్యేకతలు, వాటి పనితీరును తిలకిస్తూ వంటి వివరాలను తెలుసుకున్నారు.

మానవ రహిత హెలికాప్టర్‌ : దీనిపేరుహైడ్రోజన్‌ ఎలక్ట్రిక్‌ పవర్డ్‌ వీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. హెలికాప్టర్‌లా కనిపించే ఈ డ్రోన్‌ను ప్రస్తుతం సరకు రవాణాలకు ఉపయోగిస్తున్నారు. 100 కిలోల బరువు గల సరకును 300 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది. దీనికి పైలట్, రన్‌వే అవసరం లేదు. ఉన్నచోటు నుంచే నేరుగా పైకి వెళ్తుంది. గమ్యస్థానాన్ని నిర్ణయిస్తే నేరుగా అక్కడికి సరకును చేరవేస్తుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ 45 నిమిషాల్లో, ముంబయి నుంచి పుణెకి 30 నిమిషాల్లోపే చేరవేస్తుంది. ప్రస్తుతం మనుషులు ప్రయాణించే ఎయిర్‌ టాక్సీలకు అనుమతులు లేని కారణంగా వీటిలో రవాణా చేస్తున్నారు. 2025 నాటికి మానవరహిత డ్రోన్లలో టన్ను పేలోడ్‌తో 800 కి.మీ.ల సామర్థ్యంతో ఉండేవాటిని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు తయారీదారులు.

మందులు, ఆసుపత్రుల అవసరాల కోసం: ఈ డ్రోన్‌ను రెడ్‌వింగ్‌ అనే కంపెనీ పేరుతోనే ప్రమోట్‌ చేస్తున్నారు. దీన్ని మందులు, ఇతర ఆసుపత్రుల అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మందులు, రక్త నమూనాలు, టీకాలను తీసుకువెళ్లేందుకు వినియోగిస్తున్నారు. 3కేజీల బరువును, 50కి.మీ. మేర తీసుకెళ్తుంది. మందులను భద్రపరిచేందుకు కోల్డ్‌స్టోరేజీ కూడా ఏర్పాటుచేశారు. ‘యాలి ఏరోస్పేస్‌’ అనే సంస్థ వీటిని ప్రమోట్‌ చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలక మందులను అత్యవసరంగా ఈ డ్రోన్‌లతో సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లు, స్మార్ట్‌ మెడిసిన్‌ బాక్స్, క్లౌడ్‌ వీడియోలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మొబైల్‌ యాప్‌ ఆధారంగా ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారు.

రక్షణ రంగానికి ఉపయోగపడేలా : ఈ రంగంలో అవసరాల కోసం ‘కామికాజీ డ్రోన్‌’ను వీయూ డైనమిక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. రియల్‌ వరల్డ్‌ ఫ్లై స్టిములేషన్, అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ డైనమిక్స్‌ మోడలింగ్‌ వంటి ప్రధాన ఫీచర్లను వినియోగించి కంట్రోల్‌ రూం నుంచి ఈ డ్రోన్‌ను ఆపరేటింగ్ చేస్తారు. కంట్రోల్‌ రూంలో గాలుల తీవ్రతను గుర్తించే ప్యానల్, మూడు ఎల్‌ఈడీలతో కూడిన స్క్రీన్‌ ఉంటుంది. డ్రోన్‌తో తీసే విజువల్స్‌తో పాటు ఓపెన్​ స్ట్రీట్​మ్యాప్​, హైబ్రిడ్‌ మ్యాప్​ను సిద్ధం చేస్తారు. 150 కిలోమీటర్లు రేంజ్‌లో ఈ డ్రోన్‌ పయనించగలదు.

వ్యవసాయ రంగం : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి ఓ డ్రోన్‌ను తయారు చేశారు. క్రిమి సంహారక మందుల పిచికారీతో పాటు విత్తనాలు వెదజల్లడం దీని ప్రత్యేకత. ఈ డ్రోన్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బా సహయంతో విత్తనాలను నింపి జల్లవచ్చు. దీంతో రైతులకు విత్తన బస్తాలు మోసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే కంటెయినర్‌ 10 కిలోల బరువు మోస్తుంది. 2 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్​ సుమారు 165 అడుగుల ఎత్తు ఎగురుతుంది. ఎకరా భూమికి సరిపడా విత్తనాల్ని 8 నిమిషాలు లోపే జల్లుతుంది.

మ్యాపింగ్‌కి : ‘స్కైకాప్టర్‌ ఎ6’ పేరుతో సెన్స్‌ ఇమేజెస్‌ టెక్నాలజీస్‌ సంస్థ తీసుకొచ్చిన ఈ డ్రోన్‌ను సర్వైలెన్స్, మ్యాపింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. వీటిని వ్యవసాయం, వేస్ట్​ మేనేజ్​మెంట్​, మైనింగ్​, రియల్​ ఎస్టేట్​, సోలార్​ ప్లాంట్లు వంటి వాటికీ వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్‌లో థర్మల్​ కెమెరా, జూమ్​ కెమెరా, ఆబ్లిక్​ కెమెరా, లైడర్​, మ్యాప్​ 01 లాంటి వాటిని అవసరానికి తగినట్లుగా ఏర్పాటు చేస్తారు. ఈ రకం డ్రోన్​లో మెగాఫోన్‌ కూడా అమర్చుతారు. భారీ బహిరంగ సభల సమయంలో ఏదైనా అలజడి జరిగితే ఈ డ్రోన్‌ ద్వారా పర్యవేక్షిస్తూ తొక్కిస లాటకు తావు లేకుండా ప్రజలు ఏ మార్గం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లాలనే విషయాన్ని మెగాఫోన్‌ ద్వారా ప్రకటించే వీలుంటుంది.

ఆర్మీ అమ్ములపొదిలో నాగాస్త్ర- శత్రు దేశాల డ్రోన్ల కంటే మెరుగ్గా భారత్​లోనే తయారీ - Nagastra 1 Drone

డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేస్తున్న యువకులు - 3 నెలల్లో రూ. 3 లక్షల సంపాదన - Drone Pilot Suresh Special Story

ABOUT THE AUTHOR

...view details