Flood Level Was Decreasing in Prakasam Barrage :ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద ప్రస్తుతం 3.43 లక్షల క్యూసెక్కులుగా వస్తోంది. బ్యారేజీ 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 202 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో బ్యారేజీకి 148 టీఎంసీల వరద నీరు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.5 అడుగులుగా ఉంది. గురువారం మళ్లీ ప్రకాశం బ్యారేజికి 5.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేసింది. ఈ నెల 8 నాటికి వరద ఉద్ధృతి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత : ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ పరిహవాక ప్రాంతం జురాల ప్రాజెక్టు నుంచి 1,27,232 క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 15, 717, హంద్రీనీవా నుంచి 250 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 68, 414 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 883.90 అడుగులు, నీటి నిల్వ 215. 80 టీఎంసీలుగా ఉంది.