ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15 ఏళ్లు అయినా పరిశ్రమ స్థాపించలేదు- సరస్వతీ భూములను స్వాధీనం చేసుకోవాలి

పరిశ్రమల పేరిట రైతుల భూములను లాక్కుని 15 ఏళ్లు గడచిన పరిశ్రమ ఏర్పాటు చేయని కారణంగా సరస్వతీ పవర్ కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

AP_Leaders_Comments_on_Jagan
AP Leaders Comments on Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Dokka Manikya Vara Prasad Comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరస్వతి పవర్ కంపెనీకి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పరిశ్రమ పేరిట రైతులు, ప్రజల నుంచి వందలాది ఎకరాలను తీసుకుని, 15 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకూ పరిశ్రమ స్థాపించలేదని ఆరోపించారు. ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ భూముల్ని రైతులకు కౌలుకు ఇచ్చే దిశగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే నూతన పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే పరిశ్రమలు వచ్చి, ఉపాధి పెరుగుతోందన్నారు.

అదే విధంగా రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఇతర కంపెనీల భూముల్ని సైతం రాష్ట్రం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విజయమ్మ, షర్మిల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని సందేహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ పీ1లో వివేకానందరెడ్డిని హత్య చేశారన్న డొక్కా, ఇప్పుడు ఆపరేషన్ పీ2 ప్రారంభించారని ఆరోపించారు. ఆపరేషన్​ పీ2 వల్ల విజయమ్మ, షర్మిలకు ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం విజయమ్మ, షర్మిల భద్రత పెంచాలని కోరారు.

పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం? - శాఖలను తప్పుదోవపట్టించి మాజీ సీఎం జగన్ అడ్డగోలు మేళ్లు!

Yarapathineni Srinivasa Rao Comments: సరస్వతీ పవర్ అక్రమాలపై ఏసీబీ, సీఐడీ విచారణకు ఆదేశించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. జగన్‌ ధన దాహానికి పరాకాష్ఠ సరస్వతీ పవర్ అని ధ్వజమెత్తారు. పేదల జీవితాలు బలిపెట్టి అడ్డదారుల్లో 10 వేల కోట్ల రూపాయల సంస్థకు అధిపతి అయ్యారని ఆరోపించారు. వైఎస్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్ల రూపాయలకు పైగా జగన్ దోపిడీ చేశారన్నారు.

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ అక్రమాలపై 2008 నుంచే వ్యక్తిగతంగానూ పోరాటం చేస్తున్నానని యరపతినేని తెలిపారు. పోరాటాల ఫలితంగానే 2014 అక్టోబర్‌-9న సరస్వతీ పవర్‌ గనుల కేటాయింపును రద్దు చేశారని గుర్తు చేశారు. 2019లో వాటిని అడ్డదారుల్లో పునరుద్ధరించి, శాశ్వత నీటి కేటాయింపులు చేసుకున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాల్ని ప్రశ్నించినందుకు 2019-24 మధ్య తీవ్ర వేధింపులకు పాల్పడ్డారని, కేసులు పెట్టారని తెలిపారు.

భూములు నష్టపోయిన రైతులపైకి రౌడీమూకలను పంపించి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆనాడు రైతులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. 15 ఏళ్లుగా ఇటుక కూడా వేయని సంస్థలకు ఇంకా గనుల కేటాయింపు ఎందుకని ప్రశ్నించారు. సరస్వతీ పవర్‌కి సున్నపురాయి గనుల కేటాయింపులను సమీక్షించి, రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న జగన్‌పై చర్యలు తీసుకోవాలని, అనుమతులకు తప్పుడు పత్రాలు ఇచ్చిన జగన్‌ను జైలుకు పంపాలని యరపతినేని డిమాండ్‌ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్‌ భూముల్లో అధికారుల సర్వే

ABOUT THE AUTHOR

...view details