Deputy CM Bhatti Vikramarka Meet Odisha CM Mohan Charan Majhi : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంపై తెలంగాణ - ఒడిశా మధ్య అంగీకారం కుదిరింది. ఇవాళ ఒడిశా పర్యటనకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో సమావేశమయ్యారు. నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నైనీ బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. ఆనాడు ఇచ్చిన వినతి పత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
ఒడిశాకు రూ.600 కోట్ల ఆదాయం : నైనీ బ్లాక్లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ బ్లాక్లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒడిశా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు.