ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players

Deaf and Dumb Cricket Players: సర్వేంద్రియాలు ఉన్నా సంకల్పం లేకపోతే అనుకున్నది సాధించలేం. అదే సంకల్పం ఆయుధమైతే ఎంతటి వైకల్యమైనా చిన్నబోవాల్సిందే. విజయం దాసోహం అనాల్సిందే. పట్టుదల, ప్రతిభతో ఇదే విషయాన్ని అక్షర సత్యమని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు. పేదరికం పెట్టిన పరీక్షలను అధిగమిస్తూ, వైకల్యం వల్ల ఎదురైన అవమానాలకు బదులు చెబుతూ ప్రాణమైన క్రికెట్ క్రీడలో సత్తా చాటుతున్నారు. అవహేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకుంటున్న ఆ క్రికెటర్ల కథ ఇది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 3:35 PM IST

Deaf_and_Dumb_Cricket _Players
Deaf_and_Dumb_Cricket _Players (ETV Bharat)

Deaf and Dumb Cricket Players:క్రికెట్.. భారతీయులకు పరిచయం అవసరం లేని క్రీడ. అలాంటి ఆటలో ఔరా అనిపిస్తున్నారు ఈ క్రీడాకారులు. వీరికున్న ప్రతికూల ప్రభావంతో తోటి మిత్రులే కలసి ఆడలేదు. తెలిసిన వాళ్లే మీరేం అడతారని హేళనలు చేసిన ప్రతిసారీ సాధించాలనే పట్టుదల పెరిగింది. తామేందుకు క్రికెట్ ఆడకూడదని బలంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ పంతమే వీరిని రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించేలా చేసింది.

పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన రఘుకి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. మాటలు కూడా రావు. తండ్రి శ్రీనివాసరాజు లారీ డ్రైవర్. ఎలాగోలా కష్టపడి చదువుకుందాం అంటే తోటి విద్యార్థుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు రఘు. దాంతో తిరుపతి దేవస్థానం వారి ప్రత్యేక పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ ఆసక్తిని గమనించి స్కూల్‌ జట్టులోకి రఘును తీసుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబడుతూ ప్రతి మ్యాచ్‌లో రాణించాడు. ఏకంగా రాష్ట్రస్థాయి బధిరుల జట్టుకి ఎంపికయ్యాడు.

కాళ్లు లేకున్నా ట్రైసైకిల్​పై ఫుడ్​​ డెలివరీ- ఆగిన చోటే మొదలైన కథ! ఇదే 'ముగ్గురు మొనగాళ్ల' సక్సెస్ స్టోరీ! - Specially Abled Delivery Agents

అయితే ఇతర రాష్ట్రాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లడానికి సైతం డబ్బులు లేకపోవడంతో విజయవాడలోని ఓ వస్త్ర దుకాణంలో రఘు క్యాషియర్‌గా చేరాడు. పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూనే తెల్లవారుజామున సాధన చేసేవాడు. మరోవైపు డిగ్రీ పూర్తి చేశాడు. స్థానిక మ్యాచ్‌లలో గెల్చుకున్న పారితోషికాలు దాచుకొని తెలంగాణలో జరిగిన బధిరుల క్రికెట్‌ పోటీలకు వెళ్లాడు. అక్కడ బౌలింగ్‌లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో నిర్వాహకులు ఆంధ్రా తరఫున ప్రత్యేక రంజీ పోటీలకు ఎంపిక చేశారు.

అలా 2017లో 22 ఏళ్లకే రాష్ట్ర జట్టుకి ఎంపికవడమే కాదు.. కెప్టెన్‌ కూడా అయ్యాడు. అదే ఏడాది అనంతపురంలో జరిగిన ఏపీ టీ-20 ఛాంపియన్‌షిప్‌ ఫర్‌ డెఫ్‌ క్రికెట్‌ పోటీల్లో ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడటంతో రఘుకి కుడి చేయి విరిగింది. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, నెలకే కోలుకొని మళ్లీ జట్టులోకి వెళ్లాడు. ముంబయి, దిల్లీ, కోల్​కత్తా, బెంగళూరు సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో ఆడిన రఘు.. ఐదుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఐసీడీఏ టీ-20 మ్యాచ్‌లో ఏపీ తరఫున బౌలింగ్‌లో నాలుగోవర్లు వేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. రఘు ఇప్పటివరకు 20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించి 13 మ్యాచ్‌ల్ని విజయపథంలో నిలిపాడు.

మరోవైపు బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్నాడు సిలివేరు వేణు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పక్కన ఉన్న బొప్పూడి గ్రామానికి చెందిన అతడిని చిన్నతనంలో తండ్రి స్థానిక పాఠశాలలో చేర్పించడానికి వెళ్తే ఉపాధ్యాయులు మీ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు, అతడికి పాఠాలు చెప్పడం మావల్ల కాదని తేల్చిచెప్పారు. వేణు తల్లిదండ్రులు గ్రామంలోనే చిన్న టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుని దానిపై వచ్చే ఆదాయంతో ముగ్గురు సంతానాన్ని పోషిస్తున్నారు.

వేణును ప్రత్యేక పాఠశాలకు పంపే స్థోమత లేక ఏడోతరగతి వరకు ఓ మాస్టర్ వద్ద ట్యూషన్‌ చెప్పించారు. వేణు తన కాళ్ల మీద నిలబడేందుకు టైలరింగ్‌ షాపులో చేర్పించారు. ఆ పక్కన గ్రౌండ్‌లో తోటి స్నేహితులంతా క్రికెట్‌ ఆడటం చూసి, వేణు నేనూ ఆడతానని చాలాసార్లు అడిగాడు. అయితే అతడికి వేళాకోళాలు, సూటిపోటి మాటలే మిగిలేవి. ఇలా కాదనుకొని తెల్లవారే నిద్రలేచి ఒక్కడే ప్రాక్టీసు చేసేవాడు.

వైకల్యం విజయాలకు అడ్డమా?! - ఆత్మస్థైర్యంతో ప్రత్యర్థులకు 'చెక్' పెడుతున్న యువకుడు

చివరికి అతడి పట్టుదల, ప్రతిభను చూసి జట్టులో ఎవరైనా రాకపోతే అవకాశం ఇచ్చేవారు. అలా మొదలైన వేణు క్రికెట్ ప్రయాణం.. బ్యాటింగ్, బౌలింగ్​లో రాణించడంతో జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయికి చేరింది. 2017లో జిల్లాస్థాయి జట్టుకి ఎంపికై, సత్తా చాటాడు. 2018లో ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్ అసోసియేషన్‌ (ఐడీసీఏ)లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.

ఐడీసీఏ నేషనల్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫర్‌ డెఫ్‌ పోటీల్లో 79 బంతుల్లో 53 పరుగులు చేసి వేణు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తర్వాత ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టుకుంటూ వన్డే, టీ-20 మ్యాచ్‌ల్లోనూ ప్రతిభ చూపించాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి.. 21 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంత ప్రతిభ చూపిస్తున్నా వేణుది అరకొర ఆదాయమే.

మొదట్లో కనీసం క్రికెట్‌ కిట్‌ కూడా కొనుక్కోలేని పరిస్థితి. టైలరింగ్‌ చేస్తే వచ్చిన డబ్బులతోనే మ్యాచ్‌లకు వెళ్లేవాడు. మ్యాచ్‌ ఫీజు, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలిచినప్పుడు వచ్చే పారితోషికం.. ఇంట్లో ఖర్చులకు ఇవాల్సిన పరిస్థితి. 2023లో దుబాయిలో టీ-20 మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా.. ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేక ఆగిపోయాడు. గల్లీ క్రికెట్‌ నుంచి జాతీయ జట్టుదాకా ఎదిగిన వేణు.. భారత్‌ తరఫున ఆడి కచ్చితంగా దేశానికి ప్రపంచకప్‌ అందిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదరికం వచ్చిన రఘు, వేణు.. వైకల్యానికి ఎదురు నిలిచి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతులేని ప్రతిభతో బధిరుల క్రికెట్‌లో మేటి ఆటగాళ్లుగా అందరి ప్రశంసలందుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత అందించి మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడాలని కోరుతున్నారు.

అప్పు చేసి ప్రపంచస్థాయి పోటీలకు మరుగుజ్జు మహిళ.. మూడు పతకాలతో అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details