తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

ETV Bharat / state

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

Cyber Crimes in Hyderabad : జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ పని చేయడం లేదని, డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు.

Cyber Crimes in Hyderabad
Cyber Crimes in Hyderabad (ETV Bharat)

Dummy Messages Cyber Crimes in Hyderabad : సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, కొందరు సైబర్‌ మోసగాళ్ల బారినపడి సంపాదనను సమర్పించేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కొరియర్​, బ్యాంక్​ కస్టమర్​ కేర్​ నుంచి ఫోన్​ చేశామంటూ నిత్యం జనాలకు వేల సంఖ్యలో కాల్స్​ వస్తాయి. వీటిని నమ్మి మోసపోతున్న సైబర్​ బాధితులు ఎంతో మంది ఉన్నారు.

తాజాగా హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్‌ చేసి కంపెనీలో సహోద్యోగినని, తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్‌ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా మిత్రుడు ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి డబ్బు పంపిస్తాడని చెప్పి రూ.3.50 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ రూ.3.50 లక్షలు తిరిగి పంపాడు. మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా, ఆ డబ్బు జమవ్వలేదని తేలింది. ఆరా తీయగా సందేశాలు నకిలీవని అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి లబోదిబోమన్నాడు. ఇలా ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా, సైబర్​ వంచకులు అందిన కాడికి దర్జాగా దోచేస్తున్నారు.

డమ్మీ సందేశంతో జర భద్రం : ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతు‌న్నారు. సహోద్యోగి, క్లాస్‌మెట్‌గా పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు రూ.10 వేలు లేదా ఎంతో కొంత పంపించినట్లు అచ్చం బ్యాంకు తరహా సందేశం పంపిస్తారు. ఈ తరహా మోసంలో డబ్బు క్రెడిట్​ అయినట్లు బ్యాంకు పేరుతో సందేశం వచ్చినా, వాస్తవంగా ఖాతాలో జమ అవ్వదు. నేరగాళ్లు అవతలి వ్యక్తుల్ని బోల్తా కొట్టించడానికి డమ్మీ సందేశం పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల ఇలాంటి ఎస్​ఎమ్​ఎస్​లను చూసి నిజంగానే డబ్బు జమైందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

వ్యక్తిగత డేటా వేగంగా దొరకడం : వ్యక్తిగత డేటా అంగట్లో సరకులా దొరకడమే సైబర్​ నేరగాళ్లు పేరు, సంస్థ పేరు చెప్పి మోసగించడానికి ప్రధాన కారణం అవుతుంది. మన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం సమస్యగా మారింది. వీటి ఆధారంగా నేరగాళ్లు సులువుగా మోసగిస్తున్నారు. చిన్ననాటి స్నేహితులం, బంధువులు, సహోద్యోగి పేర్లతో డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతీ బ్యాంకు అంకెలు, ఆంగ్ల అక్షరాలతో కూడిన నిర్ధిష్ట సెండర్​ ఐడీ సందేశాలు పంపిస్తాయని, పరిచయం లేని వ్యక్తులు డబ్బులు అడిగితే మోసమని కచ్చితంగా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. డబ్బు మోసపోయినట్లు గుర్తిస్తే, ఆలస్యం చేయకుండా 1930 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​ చేసి స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

పిల్లల కోసం దాచిన సొమ్మంతా పోగొట్టావ్ - కాపురాల్లో 'సైబర్ క్రైమ్' చిచ్చు - Cyber Crime Impact on Families

కమీషన్​కు ఆశపడి సైబర్​ నేరగాళ్లకు మీ బ్యాంక్​ అకౌంట్​ ఇస్తున్నారా? - అలా చేస్తే జైలుకే! - Cyber Frauds in Mancherial Dist

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details