VIJAY PAUL REMAND REPORT: రఘురామ కృష్ణంరాజుని గతంలో సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న రఘురామ గుండెపై కూర్చుని బాదారని రిపోర్టులో తెలిపారు. రబ్బరు బెల్టులతో కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారని వివరించారు. ఈ కేసు వెనకున్న పెద్దలు బయటకు రావాలంటే విజయ్పాల్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, పిటిషన్ వేయాలని గుంటూరు కోర్టు ఆదేశించింది.
అనేక కీలక అంశాలతో 11 పేజీల రిపోర్టు: ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజుని కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ని బుధవారం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. అనేక కీలక అంశాలతో 11 పేజీల రిపోర్టుని కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు 31 మంది సాక్షులను విచారించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. వీరిలో కొంతమంది సాక్షులు న్యాయమూర్తి ఎదుట 164 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చారు. వీరిలో రఘురామ కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది, సీఐడీ అధికారులు, డ్రైవర్లు, సీఐడీ కార్యాలయం సెంట్రీ సిబ్బంది, జీజీహెచ్ వైద్యులు, వీర్వోలు ఉన్నారు.
"RRR కస్టోడియల్ హింస కేసు" - సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్పాల్కు రిమాండ్
నలుగురు వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్లు కట్టుకుని: రఘురామని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చిన రోజున రాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి, నంబరు లేని వాహనంలో సీఐడీ కార్యాలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. వాళ్లు వచ్చిన కొద్దిసేపటికే గదిలో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయని ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బంది విచారణలో తెలిపినట్లు వివరించారు. ఆరోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల మధ్య నలుగురు వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్లు కట్టుకుని నంబరు ప్లేటు లేని వాహనంలో వచ్చారని మరో ఏఎస్ఐ చెప్పినట్లు పేర్కొన్నారు. విజయ్పాల్ డ్రైవర్ని ప్రశ్నించగా హైదరాబాద్ వెళ్లడం, రఘురామని నిర్బంధించి తీసుకురావడం గురించి వివరించినట్లు తెలిపారు. అరెస్టు సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అందుకే తప్పుడు నివేదిక ఇవ్వాల్సి వచ్చింది: రఘురామ కుటుంబసభ్యులతో కూడా విజయ్పాల్ దురుసు ప్రవర్తన, అసభ్య పదజాలం వాడినట్లు పోలీసులు తెలిపారు. రఘురామ అరెస్టు సమయంలో ఆయన ఇంటిలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించి అరెస్టుకు మందు ఎలాంటి గాయాలు లేవని ఫిట్గా ఉన్నారని నిర్ధారించుకున్నారు. అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి ఒత్తిడి తీసుకురావడంతో తప్పుడు నివేదిక ఇవ్వాల్సి వచ్చిందని పలువురు ప్రభుత్వ వైద్యుల చెప్పారని పేర్కొన్నారు. అప్పటి సీఐడీ ఐజీ సునీల్ కుమార్ జీజీహెచ్కి వెళ్లి అక్కడి వైద్యులపై ఒత్తిడి తెచ్చారని తేల్చారు. అప్పటి జైలు వైద్యాధికారి రఘురామ రెండు కాళ్లపై కమిలిన గాయాలు ఉన్నాయని చెప్పినట్లు తాజా విచారణలో తేలిందని పేర్కొన్నారు.