తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

ETV Bharat / state

రాష్ట్రంలో డిజిటల్‌ హెల్త్‌కార్డులు - కుటుంబ అంగీకారంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - CM Revanth On Digital Health Cards

CM Revanth Reddy Review On Family Digital Cards : కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబరు 3 నుంచి 7 వరకు క్షేతస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జత చేర్చడం, తొలగించడం వంటివి పూర్తి చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫొటోను తీయాలని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth On Family Digital Health Cards
CM Revanth Reddy Review On Family Digital Cards (ETV Bharat)

CM Revanth On Family Digital Health Cards :కుటుంబ డిజిట‌ల్ కార్డుల‌ జారీ కోసం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్రస్థాయి పైలెట్ ప్రాజెక్టును స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాలు, సేకరించే వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు.

ప్రతీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు వివరించారు. ఒక వేళ పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాలున్న నియోజ‌క‌వర్గమైతే రెండు వార్డులు, డివిజ‌న్లు.. పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వర్గమైతే రెండు గ్రామాల్లో చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వార్డులు, డివిజ‌న్లలో జ‌నాభా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్నందున ప‌రిశీల‌న బృందాల సంఖ్యను పెంచుకోవాలని సీఎం సూచించారు.

కుటుంబస‌భ్యులు అంగీకరిస్తేనే కుటుంబ ఫొటో తీయాలి : పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజులు చేస్తారని అధికారులను సీఎం అడిగారు. అక్టోబ‌రు 3 నుంచి 7 వ‌ర‌కు అయిదు రోజుల పాటు చేప‌ట్టనున్నట్లు సీఎంకు వివరించారు. ప్రభుత్వం వ‌ద్దనున్న రేష‌న్ కార్డు, పింఛ‌ను, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటంబాలను నిర్ధారించడంతో పాటు, కొత్త సభ్యులను చేర్చి మరణించిన వారిని తొలగించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

కుటుంబ సభ్యుల ఫొటో కూడా తీయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కుటుంబ స‌భ్యులు అందరూ అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాల‌ని, అది ఆప్షనల్‌గా మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోతే ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ పైలట్ ప్రాజెక్టుకు ఉమ్మడి జిల్లాల‌ నోడ‌ల్ అధికారులకు కలెక్టర్లు మార్గనిర్దేశం చేయాలని సీఎం చెప్పారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులు చేర్పుల విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టులో ఎదురైన సానుకూల‌త‌లు, ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను పరిష్కరించి అనంత‌రం పూర్తి స్థాయి క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని సీఎం తెలిపారు.

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్‌ - TG Digital Health Profile Card

పేదలకు అండగా ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్​- ఉచిత వైద్యం కోసం అప్లై చేసుకోండిలా! - AB PM JAY Yojana

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details