CM Chandrababu Tribute to Ramoji Rao on His Jayanti :రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, తెలుగు వెలుగు, పద్మ విభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. మహనీయులు రామోజీరావు ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా పత్రికా రంగంలో విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై తిరుగులేని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. వ్యాపారాల్లో కూడా సమాజహితం, ప్రజా శ్రేయస్సు చూసిన ఏకైక వ్యాపారవేత్త ఆయన అని అన్నారు. తన సంస్థల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన రామోజీరావుని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యతగా పేర్కొన్నారు. రామోజీరావు జయంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని చంద్రబాబు ఆకాంక్షించారు.
రామోజీరావు సేవలను స్మరించుకుందాం :రామోజీ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన రామోజీరావు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. వ్యాపారంలోనూ సమాజ హితం కాంక్షించే ఆయన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.