ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి - చైతన్యవంతులు కావాలి: సీఎం చంద్రబాబు - CHANDRABABU SPEECH IN ZURICH

జైలులో ఉన్నప్పుడు బాగా మద్దతిచ్చారు - తెలుగు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu Davos Tour
CM Chandrababu Davos Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 7:10 PM IST

Updated : Jan 20, 2025, 7:38 PM IST

CM Chandrababu Speech in Zurich : రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ఎక్కువగా ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యూరప్‌లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి వచ్చారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటుకూ మనవాళ్లు వెళ్లిపోతారని వివరించారు. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారని అదేవిధంగా రాణిస్తారని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా బాగా మద్దతిచ్చారని గుర్తుచేశారు. జ్యూరిచ్​లో ఏర్పాటు చేసిన తెలుగు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

"మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా. యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి, చైతన్యవంతులు కావాలి. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. అనేకమంది యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఐటీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో భూములు అమ్ముకోవద్దని అనేకమందికి చెప్పా. హైదరాబాద్‌లో భూములకు మంచి ధర వస్తుందని ఆనాడే చెప్పా." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్‌ సంపదే కారణం. చదువులో ఆడపిల్లలపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పా. ఇప్పుడు యువతులు కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా అమ్మాయిలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్లని నిరూపితమైంది. డబుల్ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌ లెట్స్ ఎంజాయ్‌ విధానం వచ్చింది. జనాభా తగ్గిపోయి అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి' అని సీఎం వివరించారు.

హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. చంద్రబాబు చేతిలో ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరిగారని అన్నారు. ఆలోచనలు, ఉత్సాహంలో ఆయనతో పోటీపడలేకపోతున్నామని చెప్పారు. జైలులో పెట్టినప్పుడూ చంద్రబాబు అధైర్యపడలేదని ఆయణ్ని కలిసేందుకు వెళ్లిన తమకే ధైర్యం చెప్పేవారని వివరించారు. ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లు గొప్పగా ఉండాలని ఆయన అంటారని లోకేశ్ వెల్లడించారు.

అన్ని రంగాల్లో చంద్రబాబే మనకు స్ఫూర్తి అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఆయన నిజంగా విజనరీ నాయకుడని చెప్పారు. చంద్రబాబు ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని వివరించారు. తెలుగువాళ్లు సాధించలేనిది ఏమీ లేదని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనవారు కనిపిస్తారని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వ గెలుపునకు ఎన్‌ఆర్‌ఐల పాత్ర కూడా ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

CM Chandrababu Davos Tour Updates :చంద్రబాబు రూపంలో ఏపీకి మంచి పరిపాలకుడు వచ్చారని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. చాట్ జీపీటీని కొన్ని ప్రశ్నలు వేశానని చెప్పారు. రాజకీయాల్లోకి రాకుంటే చంద్రబాబు ఏం అయ్యేవారని ప్రశ్నించగా ఇండియన్‌ ఎలాన్ మస్క్ అయ్యేవారని చాట్ జీపీటీ చెప్పిందని భరత్ వ్యాఖ్యానించారు.

జ్యూరిచ్​లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్

Last Updated : Jan 20, 2025, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details