CM Chandrababu Help to Pregnant in Flood Area in Vijayawada : విజయవాడ కండ్రిక వాంబే కాలనీకి చెందిన 31 ఏళ్ల లక్ష్మి. నిండు గర్భిణి. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.. చూస్తే చుట్టూ నడుంలోతు వరద నీరు. అంబులెన్స్ వచ్చే వీలు లేదు. ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. చుట్టుపక్కల వారూ ఎవరి కష్టాల్లో వారున్నారు. లక్ష్మితోపాటు కుటుంబ సభ్యులందరిలోనూ ఒకటే ఆందోళన. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లారు. అప్పుడే ఆపద్బాంధవుడిలా అటొచ్చిన చంద్రబాబు వెంటనే ట్రాక్టర్ పిలిపించి వరద నీటిని దాటించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు.
సాయం కోసం వేచిచూస్తున్న నిండు గర్భిణీ :సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ అప్పటికే నిండు గర్భిణి అయిన లక్ష్మి సాయం కోసం ఎదురుచూస్తోంది. పక్కవారిని ఎవరినన్నా సాయం రమ్మందామంటే వారి ఇబ్బందులు వారివి. ఇప్పుడెలా అనే ఆందోళన కుటుంబసభ్యుల్లో. సరిగ్గా ఆపద్బాంధవుడిలా అటుగా వచ్చారు చంద్రబాబు. అధికారులు అటు వైపు ప్రయాణం సురక్షితం కాదని చెబుతున్నా వినకుండా వీధుల్లోని చివరి ఇంటి వరకు జేసీబీపై వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అన్నం కూడా తినకుండా సాయంత్రం వరకు పర్యటన కొనసాగించారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతా - కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం - CM Chandrababu Naidu on Floods
అప్పటికప్పుడు ట్రాక్టర్ను పిలిపించిన సీఎం :ఈ క్రమంలోనే లక్ష్మి బంధువులు ఆయన వద్దకు వెళ్లి నిండు గర్భిణి పడుతున్న అవస్థలను వివరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం కోరారు. నిండుగర్భిణి పడుతున్న ఇబ్బంది తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ట్రాక్టర్ను పిలిపించారు. ఈమెను అందులో ఎక్కించి తన కార్యాలయ సిబ్బందిని కూడా లక్ష్మికి తోడుగా పంపి ముంపు ప్రాంతాన్ని సీఎం దాటించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి దగ్గరుండి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు, ఆయన కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ శోభ ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
'ప్రాణాలతో బయట పడతామనుకోలేదు' - చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన - Chandrababu Talk To Flooded People
అధికారులు సైతం ఇలానే వ్యవహరిస్తే : అధికారులంతా వరద బాధితుల కష్టాలను ఓపిగ్గా వినాలని, వారి కుటుంబ సభ్యులే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా స్పందిస్తారో అదే విధంగా ప్రజల కోసం పనిచేసి ఇబ్బందులు తీర్చాలని గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా ఆచరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు, చూపిస్తున్న చొరవే నిన్న నిండుగర్భిణి లక్ష్మికి వరమైంది. అధికారులు, సిబ్బంది కూడా ఆయనలా మానవతాదృక్పథంతో వ్యవహరిస్తే ఎంతమందికి సాయం చేయవచ్చో, మరెంతమంది ప్రాణాలు కాపాడవచ్చో తెలియజెప్పింది.
సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas