ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 23 hours ago

ETV Bharat / state

వైఎస్సార్సీపీ లిక్కర్ స్కాం అప్డేట్ - అస్మదీయులకే మద్యం ఆర్డర్లు - CID Inquiry on YSRCP Liquor Scam

CID Investigation on YSRCP Liquor Scam : జగన్‌ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సీఐడీకి కీలక ఆధారాలు లభించాయి. వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వైఎస్సార్సీపీలో నంబర్‌ టూ గా చలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి గుప్పెట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్‌ డిస్టిలరీస్‌కూ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని దర్యాప్తులో తేల్చింది. కేవలం అస్మదీయ, కమీషన్లు చెల్లించిన కంపెనీలకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారని బేసిక్‌ ప్రైస్‌ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.

CID INQUIRY ON YSRCP LIQUOR SCAM
CID INQUIRY ON YSRCP LIQUOR SCAM (ETV Bharat)

AP CID Probe Extortion in Purchase Liquor : జగన్‌ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సీఐడీ గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, అస్మదీయులైన వారి బినామీలతో పాటు, నిర్దేశిత కమీషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేల్చింది. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్‌ ప్రైస్‌ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చింది.

విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజస్‌ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్‌ విభాగాల్లో వరుసగా రెండో రోజూ విస్తృతంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్‌ ప్రైస్‌, వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. తద్వారా దోపిడీ జరిగిన తీరు అధికారులు గుర్తించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పార్టీలో నంబర్‌- 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడినుంచే జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు, ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటైందని, ఇది ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజు పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాలను సేకరించింది.

AP Liquor Scam Updates : ఏపీఎస్​బీసీఎల్​ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయి? గత ఐదేళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్​బీసీఎల్​ కొనుగోలు చేసింది? అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని దస్త్రాల ఆధారంగా సీఐడీ విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది. వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టైరై ఉండగా అందులో ఓ 10 సంస్థలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వీటిల్లో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిలరీలే లేవని, ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది.

వైఎస్సార్సీపీ వచ్చాక ఏర్పాటైన కంపెనీలే ఎక్కువ : అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు కొన్ని వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైనవేనని గుర్తించింది. దీని వెనక ముందస్తు నేరపూరిత కుట్ర, కుమ్మక్కు ఉందని నిర్ధారించింది. జగన్‌ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సీఐడీ తన దర్యాప్తులో తేల్చింది. ఏపీఎస్​బీసీఎల్ గత ఐదేళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు రూ.15,000ల కోట్ల వరకూ చెల్లించిందని అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది.

ఏ కంపెనీ వెనక ఎవరున్నారు? : జగన్‌ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌తో పాటు జేఆర్‌ అసోసియేట్స్, ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రాడక్ట్స్‌ లిమిటెడ్, ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సెంటినీ బయోప్రాడక్ట్స్, శర్వానీ ఆల్కో బ్రూవరీస్‌ వంటివి ప్రధానమైనవిగా గుర్తించారు. వాటి వెనక ఎవరున్నారు? వాటికే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడం వెనకున్న లోగుట్టు ఏంటి? ఎవరు? ఎలా ప్రభావితం చేశారు? అనేదానిపై సీఐడీ ఆరా తీస్తోంది.

కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమీషన్‌ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆయా కంపెనీల వివరాలు సిద్ధం చేసింది. నాణ్యత లేని, నాసిరకమైన జే బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్న ఫిర్యాదులపై రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులని పేర్కొన్నారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు, కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశముంది.

'జగన్ అతి పెద్ద లిక్కర్ సిండికేట్' - నూతన మద్యం విధానంపై సీఎంతో మంత్రుల సమావేశం - CM Review on New Liquor Policy

మద్యం ముసుగులో' జగన్​ అండ్​ కో' - కీలక పాత్ర ఆ నాయకులదే! - Huge Liquor Scam In AP

ABOUT THE AUTHOR

...view details