Chandrababu allegations on CM jagan:నవరత్నాలు పేరుతో ప్రజలను మోసగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నవరత్నాల్లో ఇసుక, గంజాయి, భూ మాఫియా, మైనింగ్, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్మెంట్లు దాడులు-కేసులు, శవ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కడప ఏడురోడ్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్దా? ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలని చంద్రబాబు తెలిపారు.
జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్న చంద్రబాబు, తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అన్న, చెల్లి ఇంట్లో పోరాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుందన్నారు. సీబీఐ అరెస్టు చేసే సమయంలో అధికారం ఉపయోగించి అడ్డుకున్నారు, ఈ ముగ్గురు మారీచులు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొండలను అనకొండలు మింగేశాయని దుయ్యబట్టారు.