ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్మీడియట్ విద్యార్థిని సజీవ దహనం - హత్యనా, ఆత్మహత్యనా? - NANDIKOTKUR INTER STUDENT INCIDENT

మిస్టరీగా మారిన నందికొట్కూరు అగ్ని ప్రమాద ఘటన - అనేక అనుమానాలు

Nandikotkur Inter Student Incident
Nandikotkur Inter Student Incident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 9:46 AM IST

Updated : Dec 9, 2024, 9:26 PM IST

Nandikotkur Inter Student Incident :నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారుజామున ఇంటర్మీడియట్ విద్యార్థిని సజీవ దహనం అయిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆ సమయంలో బాలిక గదిలోనే ఉన్న ఓ యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు ఆమె తల్లిదండ్రులు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెందినవారు. ఏకైక కుమార్తె. బాలిక మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి ఆత్మహత్య చేసుకోగా, తల్లి బాగోగులు చూసుకుంటున్నారు.

తమ స్వగ్రామంలో ఇంటర్మీడియెట్‌ కోర్సు లేకపోవడంతో కుమార్తెను నందికొట్కూరులోని తన తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. విద్యార్థిని వెల్దుర్తి మండలానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో గతంలో పరిచయం ఉంది. పదో తరగతితో చదువు మానేసిన ఆ యువకుడు 2 నెలల కిందట బాలిక కోసం నందికొట్కూరులోని వారింటికి వచ్చాడు. బాలికతో చాలా సేపు మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన బాలిక అమ్మమ్మ, తాతయ్యలు ఆ యువకుడిని హెచ్చరించారు. తాను బాలిక కంటే సంవత్సరం సీనియర్‌ అని, తాము స్నేహితులం మాత్రమేనని రాఘవేంద్ర వారికి చెప్పి వెళ్లిపోయాడు.

ఎవరు గడియ పెట్టి ఉంటారు? : బాలిక అమ్మమ్మ, తాతయ్య ఇంటికి ఆనుకొని, ముందు భాగంలో చిన్న గది ఉండగా, దాన్ని స్టోర్‌రూంగా ఉపయోగిస్తున్నారు. విద్యార్థిని అప్పుడప్పుడు ఆ గదిలో కూర్చొని చదువుకునేది. సోమవారం తెల్లవారుజామున కూడా చదువుకుంటానని ఇంట్లోంచి ఆ గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో నిద్రలేచిన అమ్మమ్మ, మనవరాలు ఆ గదిలోకి వెళ్లాక ఇంటి తలుపు వేసుకుని నిద్రపోయారు. గంట తరువాత భారీ శబ్దం రావడంతో తాతయ్య, అమ్మమ్మ ఇంటి బయటకు వచ్చి చూస్తే, ఆ గది నుంచి పొగలు వస్తున్నాయి. గది లోపలి నుంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. వారు బయటి నుంచి తలుపులు తీయగా, రాఘవేంద్ర కాలిన గాయాలతో బయటకు వచ్చి, కింద పడిపోయాడు. బాలిక శరీరం అప్పటికే చాలా వరకు కాలిపోయి మృతి చెందింది. తల భాగం గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. రాఘవేంద్రను తొలుత నంద్యాల జీజీహెచ్‌కు, తరువాత కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అతని శరీరం 80 % కాలిపోయిందని, మాట్లాడే స్థితిలో లేడని వైద్యులు తెలిపారు.

హత్యనా ఆత్మహత్యనా? : ఘటనా స్థలాన్ని బట్టి బాలికను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాఘవేంద్రనే హత్య చేశాడని తొలుత ప్రచారం జరిగింది. అతనికి చంపే ఉద్దేశం ఉంటే, బాలికకు నిప్పంటించిన తర్వాత పారిపోయేవాడని, కానీ, మంటల్లో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వారిద్దరూ లోపల ఉన్నప్పుడు బయటి నుంచి గడియ పెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నందున ఇతరుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినా, లోపలి నుంచి కేకలు వినిపించలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 11.36కు బాలికకు రాఘవేంద్ర ఫోన్‌ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

గదిలో వారి మధ్య గొడవ జరిగి, పెనుగులాట చోటు చేసుకున్న దాఖలాలు ఏమీ కన్పించలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, రాఘవేంద్ర, బాలిక మధ్య గతంలో పరిచయాలు ఉన్నాయని, తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారని, వివాదాలేమీ లేనట్లు తెలుస్తోందని అన్నారు. ఆ యువకుడే నిప్పంటించినట్లు తేలితే, హత్య కేసుగా మారుస్తామని, ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు యత్నించారా? అన్న కోణాన్నీ పరిశీలిస్తున్నామని తెలిపారు. క్లూస్‌టీం, వైద్య బృందాలతో ఆధారాలు సేకరించామని, విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందేమోనన్న అనుమానం కూడా ఉండటంతో విద్యుత్తు శాఖ సిబ్బందిని పిలిపించామని, ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి మరికొన్ని విషయాలు తెలుస్తాయని వారు వివరించారు.

మహిళా కానిస్టేబుల్​ దారుణహత్య - సొంత తమ్ముడే నిందితుడు - ప్రేమ పెళ్లే కారణం!

ఇన్‌స్టాగ్రామ్​లో ప్రేమ - ప్రియుడి కోసం పరితపించిన యువతి, చివరికి ఏం చేసిందంటే?

Last Updated : Dec 9, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details