Avuku ITI College Problems : ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు. కానీ కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరిన భవనాలు, చాలీచాలనీ మౌలిక వసతులతో విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తరగతి గదుల్లో ఫర్నీచర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా ఆ కాలేజీలో 360 మంది స్టూడెంట్స్ ఉన్నా గత పాలకులు ఒక కళాశాల భవనం కట్టించలేకపోయారు. పైగా బ్రిటిష్ హయాంలో కట్టిన సబ్ జైలులోనే తరగతులు చెప్పిస్తున్నారు. అందులోనూ వసతులు లేవు. ఒక్కో గది స్టోర్రూమ్ను తలపిస్తోంది.
నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) కాలేజీని గతంలో సబ్ జైలులా వాడిన భవనంలో కొనసాగిస్తున్నారు. జైలు అవసరాల కోసం నిర్మించిన భవనం కావడంతో బ్యారక్లలో రేకులు, అట్టముక్కలు అడ్డుపెట్టి తరగతి గదులుగా మార్చుకున్నారు. విద్యార్థులు ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. అవీ చాలక కొన్ని తరగతులను రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. 2008 నుంచీ ఇదే తంతు. ఐటీఐ కళాశాల భవనం కోసం గతంలో అవుకు శివారులోని కొండపై 10 ఎకరాల స్థలం కేటాయించి రూ.6 కోట్లు మంజూరు చేశారు.