Artix Exhibition in Hyderabad : వేయి మాటల్లో చెప్పలేని భావాలను ఒక చిత్రం చెబుతుంది. అలాంటి చిత్రాలన్నీ ఒకచోట చేరితే చిత్రకారులకు, అభిమానులకు అంతకంటే ఆనందం మరొకటుండదు. అలాంటి వేదికను ఆర్టిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో పేరొందిన చిత్రకారుల చిత్రాలు, ఇతర కళారూపాలను ఒకచోట చేర్చింది. ఆరుషి ఆర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో ప్రాచీన భారత కళలను చాటి చెప్పేలా గీసిన చిత్రాలు, వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. దిల్లీ, ముంబయి, పుణె, గుజరాత్, చెన్నై, బెంగళూర్కు చెందిన ప్రముఖ చిత్రకారులు వేసిన పలురకాల పెయిటింగ్స్ను ప్రదర్శనగా ఉంచారు.
Arushi Arts Exhibition in Hyderabad 2024 :హైదరాబాద్కు చెందిన లక్ష్మణ్ ఏలె, లక్ష్మగౌడ్ లాంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలు సైతం ఆర్టిక్స్లో ప్రదర్శనగా ఉంచారు. మను ఫరేఖ్, ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రాలు ప్రదర్శనలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూణెకు చెందిన నారయణ్ అనే చిత్రకారుడు గోల్ఫ్ ఆటగాళ్లు రేసులో ఉన్న అంశంతో గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. శతాబ్దాల క్రితం చిత్రకారులు ఎంతో అందమైన చిత్రాలు గీశారు. ఆ తరహా ఆర్ట్ క్రమంగా కనుమరుగైపోయింది. ఆధునిక చిత్రకారులు ఆ తరహా చిత్రాలను గీస్తూ గతంలో చిత్రకారుల్లో ఉన్న ప్రతిభ గురించి చాటి చెబుతున్నారు. ప్రాచీన భారతాన్ని చాటిచెప్పే విధంగా ఢిల్లీకి చెందిన ఆంచల్ గార్గ్ గీసిన చిత్రాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
"అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు వేసిన పలురకాల పెయిటింగ్స్ను ప్రదర్శనగా ఉంచారు. ఆర్టిస్ట్లందరూ వివిధ రకాల మెటీరియల్ ఉపయోగించి చిత్రాలు గీశారు. వీటిని ఒక్కసారి చూస్తే వీరు ఎలా ఇలా ఆలోచించగలిగారని ఆశ్చర్యమేస్తుంది. క్యాలెండర్స్, పాత వస్తువులను సేకరించి అందమైన చిత్రాలను గీశారు. ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు ప్రముఖ చిత్రకారులు వచ్చి చిత్రాల ప్రాధాన్యతను అడిగి తెలుసుకుంటున్నారు." -శ్రీనాధ్, అలేఖ్య హోమ్స్ ఎండీ