APPSC 2018 Group 1 Mains Exam: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ 6 నెలల్లో మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల టైమ్ ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ తీసుకున్నఅభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని, న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.
అంతమంది ఎలా అనర్హులవుతారు: 2018 గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అనర్హులుగా నిర్ణయించిందని కోర్టుకు నివేదించారు. జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు.
వ్యాజ్యాలపై హైకోర్టు పలు దశల్లో విచారణ జరిపింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు 2022 జూన్ 24న హైకోర్టు ధర్మాసనం ఏపీపీఎస్సీకి అనుమతిచ్చింది. నియామకాలు జరిపితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించింది. పోస్టింగ్ ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని పొందుపరచాలని పేర్కొంది. హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రధాన వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపి బుధవారం తీర్పు ఇచ్చారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం: హాయ్ల్యాండ్ ఆవాస రిసార్ట్స్లో 2021 డిసెంబరు 5వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 26వ తేదీ మధ్య తొలిసారి మాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు పిటిషనర్లు ఆధారాలతో రుజువు చేశారని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. మాన్యువల్ మూల్యాంకనం కోసం అవసరమైన సామగ్రి ముద్రణ, సరఫరా కోసం డేటాటెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏపీపీఎస్సీ 2021 నవంబరులో 17 వేల 936 రూపాయలు చెల్లించినట్లు పిటిషన్లో తెలిపారని వెల్లడించింది. మూల్యాంకనం ఏర్పాట్లకు 20.06 లక్షలు చెల్లించారని, అక్కడ ప్రక్రియ జరగకపోతే సొమ్ము చెల్లించక్కర్లేదన్నారని తెలిపింది.