Vallabhaneni Vamsi Case Upadtes:వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు గన్నవరం నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పెండింగ్ కేసులపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేసులను ఒక్కొకటిగా బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీని పెండింగ్లో ఉన్న కేసులలో పీటీ వారెంట్లు వేసి కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అక్రమాలను ఒక్కొకటిగా వెలికితీసే ప్రయత్నం: హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్లో గత ఏడాది నవంబరులో నమోదైన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. ప్రాథమిక సహకారం సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు తన సొంత స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అదే విధంగా గత ఏడాది ఎన్నికల సమయంలో తేలప్రోలులో ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతంలో మాజీ ఎమ్మెల్యేకు 41ఏ నోటీసు ఇచ్చారు. నోటీసు అందుకున్నా ఇంత వరకు విచారణకు హాజరుకాలేదు. ఈ కేసు విషయంలో పీటీ వారెంటు వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈనెల 20 వరకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ను రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.