ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా - త్వరలోనే అమల్లోకి ! - HEALTH INSURANCE IS FREE IN AP

రూ.2.5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు - ఆపై ఖర్చు భరించనున్న ఎన్టీఆర్​ వైద్య సేవ ట్రస్ట్​ - 6 గంటల్లోనే చికిత్సకు అనుమతి

Free Health Insurance
Free Health Insurance (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 7:18 AM IST

Health Insurance is Free in Andhra Pradesh: రాష్ట్ర ప్రజలందరికీ త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ విధానం అమల్లోకి వస్తే చికిత్స కోసం 6 గంటల్లోనే అనుమతి పొందవచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నతస్థాయిలో జరిగే సమీక్ష సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

షరతులతో నిమిత్తం లేకుండా:దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండరు పిలువబోతున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కింద ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండరు డాక్యుమెంట్‌ సిద్ధమైంది.

ఏప్రిల్​ లేదా మే నుంచి: ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలుస్తారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97 శాతం ఉంది. సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.

5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఉచిత వైద్యం:ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో కోటీ 43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్‌ సుమారు 7వేల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి, మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండరు పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్‌చేసి, ఎల్‌1గా ప్రైవేట్‌ కంపెనీ వస్తే.. అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్‌ బాధ్యత అప్పగిస్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థే ఎల్‌1గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ఇకపై 6 గంటల్లోనే: ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభ అనుమతి లభిస్తుంది. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు. ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీసును అందించాలి. ప్రతి ఏడాది పని తీరును సమీక్షిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలోనూ కొనసాగుతాయి. వైద్య మిత్రల సేవలను కొనసాగిస్తారు. ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలల కొకసారి ప్రభుత్వపరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు. దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు తలెత్తవు.

వివిధ రకాల చికిత్సల వివరాలు: రోగులకు చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండరు డాక్యుమెంట్‌లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం 30 రకాల స్పెషాల్టీలతో కలిపి 3 వేల 257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే 19 వందల 49 రకాల చికిత్సలూ ఇందులో ఉన్నాయి. బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయ మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకుని మిగిలిన దానిని వెనక్కి ఇచ్చేయాలి. ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

రూ.2500 ప్రీమియం: ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2,500 వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ బీమా కంపెనీలు పోటీపడతాయి. తమిళనాడు, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి. డబ్ల్యూహెచ్​వో అధ్యయన ఫలితాలు, వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది.

బీమాపై మరింత ధీమా - వైద్య సేవలు మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం కసరత్తు

జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌ ప్రారంభం - ఇన్సూరెన్స్‌పై నిర్ణయం మళ్లీ వాయిదా!

'వారి పేర్లను నమోదు చేయండి' : ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్‌పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details