ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లు అర్జున్‌ విడుదల - వెనుక గేటు నుంచి పంపించిన అధికారులు - ALLU ARJUN RELEASED FROM JAIL

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ - రాత్రి జైలులోనే ఉన్న నటుడు అల్లు అర్జున్‌

ALLU ARJUN RELEASE UPDATES
ALLU ARJUN RELEASE UPDATES (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2024, 6:27 AM IST

Updated : Dec 14, 2024, 8:55 AM IST

ALLU ARJUN RELEASE UPDATES :చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ను అధికారులు పంపించారు. ఎస్కార్ట్‌ వాహనం ద్వారా నివాసానికి అల్లు అర్జున్‌ను పంపించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్‌ అరెస్టు అయ్యారు. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదలయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 18 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.

భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు: జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్‌ నేరుగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లారు. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరారు. సుమారు గంటకు పైగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయంలోనే ఉన్నారు. 45 నిమిషాలపాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు. తరువాత అభిమానులకు అభివాదం చేసుకుంటూ వాహనం ఎక్కారు. అక్కడ నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్‌ను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేశారు.

అర్ధరాత్రి వరకు ఉత్కంఠ: కాగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ విడుదలపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్‌ విధించగా, పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇవాళ ఆయనను విడుదల చేయనున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

అరెస్టు, రిమాండ్‌, అనంతరం మధ్యంతర బెయిల్‌: ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ అరెస్టు, రిమాండ్‌, అనంతరం మధ్యంతర బెయిల్‌తో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయనను శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, వాంగ్మూలం, వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు గేటు వద్ద అల్లు అర్జున్‌ ఏఆర్ సిబ్బందితో గొడవ పడినట్టు సమాచారం. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. ఇదే బ్యారక్‌లో ఇతర కేసులకు సంబంధించిన ఇద్దరున్నారు. జైలులో కొంతసమయం ముభావంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్‌ యజమానులిద్దరికి కూడా మధ్యంతర బెయిలు మంజూరైంది. అర్జున్‌ 50 వేల వ్యక్తిగత బాండ్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్‌ గోస్వామి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, భజన్‌లాల్‌ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్య థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం, దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంపు వేసిన విషయాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని, అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని, పోలీసులకు సహకరించాలని సూచించారు.

చంచల్‌గూడ వద్దకు భారీగా అభిమానులు: అయితే రాత్రి 7 నుంచి 9 గంటల్లోపు అల్లు అర్జున్‌ విడుదల అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, మామ చంద్రశేఖర్ రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఎస్కార్ట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగటంతో ఆయనను డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొంత సమయానికి జైలు వద్ద వదలి వెళ్లారు. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటిముఖం పట్టారు. ఏ సమయంలోనైనా ఆయన విడుదల కావచ్చనే సమాచారంతో చంచల్‌గూడ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10గంటలకు తర్వాత చేరటంతో చంచల్‌గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఆలస్యంగా వచ్చిన బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన విచారణ ఖైదీలను మరుసటిరోజు విడుదల చేయటం ఆనవాయితీ. ఇదే క్రమంలో అల్లు అర్జున్ విడుదల కానున్నారు.

అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నం: తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్‌ఎస్‌ చట్టంలోని 105, 118 (1) రెడ్‌విత్‌ 3 (5) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అర్జున్‌ను ఏ11 నిందితుడిగా చేర్చారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

'ఇది మనందరి తప్పు' - అల్లు అర్జున్​ అరెస్ట్​పై స్పందించిన హీరో నాని

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ - చంచల్​గూడ జైలుకు తరలించిన పోలీసులు

Last Updated : Dec 14, 2024, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details