Allocations for Railway Development in AP: ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూపీఏ కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఏపీలోని 73 స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడించారు. దిల్లీలో మీడియాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు.
అందుకే బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు: ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. ఏపీకి మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు కేటాయించామని, రైళ్ల వేగం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వేల అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి, అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని చెప్పారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని అన్నారు. ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తైందని వెల్లడించారు.
పేదవర్గాల కోసం అమృత్ భారత్ రైళ్లు : ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అన్నారు. పేదవర్గాల కోసం అమృత్ భారత్ రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. అమృత్ భారత్ రైళ్ల ద్వారా పేదలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్లను పరిశీలించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ట్రాక్ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తామని స్పష్టం చేశారు.