ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / press-releases

ఇన్‌స్టాగ్రామ్​లో ఇద్దరితో ప్రేమాయణం - పెళ్లికి నో చెప్పాడని దారుణం - INSTAGRAM LOVE

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు యువతులు - మోసపోయామని తెలుసుకొని ఆత్మాహత్యాయత్నం

Woman Lost Life with Instagram Love
Woman Lost Life with Instagram Love (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 1:47 PM IST

Woman Lost Life with Instagram Love : ఇద్దరు యువతులు ఒకరికి తెలియకుండా మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే అబ్బాయిని ప్రేమించారు. విషయం తెలుసుకున్నాక తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అతను ఒప్పుకోకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువతులు ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని బత్తలపల్లి మండలం గరిసినపల్లెకు చెందిన దివాకర్‌ డిగ్రీ పూర్తి చేసి అనంతపురంలో బైక్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇన్‌స్టాలో ముదిగుబ్బకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఈమెకు వేరొకరితో వివాహం చేశారు. అయితే ఈమె నెల రోజులు గడవకనే భర్తను వదిలేసి సొంతూరుకు చేరుకుంది. అప్పటి నుంచి దివాకర్‌ను కలుస్తుండేది.

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ - ఒక అబ్బాయి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నం (ETV Bharat)

చెల్లెలి ఫ్రెండ్​తో పరిచయం: ఇదే క్రమంలో దివాకర్‌కు తన చెల్లెలి స్నేహితురాలైన కణేకల్లు మండలం యర్రగుంటకు చెందిన యువతి పరిచయమైంది. ఈమె ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ గుల్జార్‌పేటలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనతోపాటు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఈమె తెలుసుకుని దివాకర్​ని నిలదీసింది. ఇలా ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవ సాగింది. ప్రియురాళ్లను ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని దివాకర్ భావించాడు. ఈ మేరకు యువతులిద్దరినీ ఓ వసతి గృహానికి తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం వరకూ ముగ్గురూ గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని యువతులు పట్టుబట్టారు.

దీంతో దివాకర్ ఎవరినీ చేసుకోనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మోసపోయామని తెలుసుకున్న యువతులు నగరంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణలోకి వెళ్లి అక్కడ విషం తాగారు. స్థానికులు వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు తన వాట్సప్‌ ప్రొఫైల్‌కు యూట్యూబర్‌ హర్షసాయి, ట్రూ కాలర్‌లో క్రికెటర్‌ కోహ్లీ, ఫోన్‌ పేకు అల్లు అర్జున్‌ ఫొటోలు పెట్టుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో మారుపేర్లు, సెలబ్రిటీల ఫొటోలను డీపీగా పెట్టుకుని అమ్మాయిలను ఆకర్షిస్తుంటాడని తెలిసింది.

కళ్లలో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన మహిళ అరెస్టు - విచారణలో దిమ్మ తిరిగే నిజాలు

రాత్రి ఆరుబయట నిద్రించింది - తెల్లారేసరికి కాలి బూడిదైంది

ABOUT THE AUTHOR

...view details