Chandrababu Naidu in Ayodhya: యావత్ దేశం ఎదురుచూస్తున్న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు అంతా సిద్ధమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. నేడు అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబును ఆహ్వానించారు.
చంద్రబాబుతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు అయోధ్యకు వెళ్లారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. నేడు అయోధ్యలో జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం అయోధ్య నుంచి తిరిగివస్తారు.
రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఆదివారం అయోధ్యకు చేరుకోగ, ఆయనకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
అంతా రామమయం - రాష్ట్రంలో భారీ ఎత్తున శోభాయాత్రలు
జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్యకు వెళ్లడం కోసం ప్రముఖ నటుడు రజనీకాంత్ లఖ్నవూ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు ఆదివారం నుంచే అయోధ్యకు చేరుకున్నారు. అదే విధంగా సినీనటి కంగనా రనౌత్ ఇప్పటికే అయోధ్యలో ఉన్నారు.