Youth Joined From YSRCP To TDP :రాష్ట్రంలో ఎన్నికల పండుగ జోరుగా జరుగుతున్న తరుణంలో జంప్ జిలానీలు ఎక్కువవుతున్నారు. కొందరు టికెట్ దక్కలేదని, మరికొందరు ఆ పార్టీ వ్యవహారశైలి నచ్చక నేతలు గుడ్ బై చెబుతున్నారు. వైఎస్సార్సీపీలో చాలా మంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ఒక ఎత్తు అయితే అధికార పార్టీ నేతలు ఈ తరుణంలో అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. 'పార్టీ కండువాలు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవరైనా కనపడితే కండువా బలవంతంగా ఎదుటి వారి భుజాన వేసి నాలుగు పొటోలకు ఫోజులిచ్చి జబ్బలు చరుచుకుంటున్నారు. ఇలాంటి ఘటనకు నిదర్శనం స్పీకర్ తమ్మినేని సీతారాం.'
ఇలాంటి పనులు మానుకుంటే మంచిది : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గం సరుబుజ్జిలి మండలం మూల సమలాపురం గ్రామానికి చెందిన యువతకు శుక్రవారం ఆమదాలవలస స్పీకర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కండువా కప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అయితే ఇదంతా యువతకు తీవ్ర విరక్తి కలగడంతో శనివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సమక్షంలో పసుపు కండువాలు వేసుకుని టీడీపీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు శుక్రవారం స్పీకర్ తమ్మినేని సీతారాం క్రికెట్ కిట్లు ఇస్తామని పిలిపించి బలవంతంగా అధికార పార్టీ కండువాలు వేశారని ఆరోపించారు.