Winning MP candidates in Telangana :లోక్సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. డబుల్ డిజిట్పై కన్నేసిన రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడినా ఓటర్లు మాత్రం ఎవరికీ పూర్తిస్థాయిలో పట్టం కట్టలేదు. 17 స్థానాలకు గాను కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించగా ఎంఐఎం హైదరాబాద్ను నిలబెట్టుకుంది.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి 4 లక్షల 62 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావును ఓడించారు. అక్కడి నుంచి బీజేపీ తరఫున బరిలో తాండ్ర వినోద్రావు మూడోస్థానానికే పరిమితమయ్యారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందురు రఘువీర్రెడ్డి విజయదుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైదిరెడ్డిపై 5 లక్షల 51 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ ఓట్ల పరంగా రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. 2011లో కడప లోక్సభ ఉపఎన్నికలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 5 లక్షల 43 వేల మెజార్టీతో గెలవగా అంతకు మించిన మెజార్టీ కంటే ఎక్కువ సాధించి అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నారు.
Telangana MP Elections Results 2024 : వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రెండు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీకి చెందిన ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. భువనగిరిలో హస్తం పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డి లక్షా 95 వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 88 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ లక్షా 31 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. జహీరాబాద్లో సురేశ్ షెట్కార్ 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసిన బీజేపీ ఈసారి 8 స్థానాలు దక్కించుకుంది. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ 3 లక్షల 80 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీప ప్రత్యర్థి దానం నాగేందర్పై 52 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమీప ప్రత్యర్థి వినోద్కుమార్పై రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. మెదక్ లోక్సభ స్థానంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 32 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై విజయం సాధించారు.
BJP and Congress MP Candidates 2024 :పాతికేళ్ల తర్వాత మెతుకుసీమలో కాషాయజెండా రెపరెపలాడింది. నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ లక్షా 9 వేల 241 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి జీవన్రెడ్డిపై ఘనవిజయం సాధించారు. ఆదిలాబాద్లో కమలం అభ్యర్థి గోడం నగేశ్ సమీప ప్రత్యర్థి ఆత్రం సుగుణపై 78 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రంజిత్రెడ్డిపై విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఉత్కంఠభరిత పోరులో డీకే అరుణ 4 వేల ఓట్లకు పైచిలుకు స్వల్ప తేడాతో సమీప ప్రత్యర్థి వంశీచంద్ రెడ్డిపై గెలుపొందారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రౌండ్ రౌండ్కు విజయం దోబూచులాడగా ఎట్టకేలకు డీకే అరుణ గట్టెక్కారు.