తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పరీక్షల ఒత్తిడిలో ఉన్నారా? - ఈ టిప్స్ పాటించారంటే కూల్​గా రాసేయొచ్చు! - STRATEGY IN TELUGU INTER STUDENTS

మరో 8 రోజుల్లో ఇంటర్ పరీక్షలు - ప్రిపరేషన్​లో విద్యార్థులకు ఒత్తిడి - అది జయించేందుకు టిప్స్​ - ఈ సూచనలు పాటిస్తే బెస్ట్​ స్కోర్​ చేసే ఛాన్స్

Strategy for Inter Students for Board Exams
Strategy for Inter Students for Board Exams (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 12:57 PM IST

Strategy for Inter Students for Board Exams :మరో 8 రోజుల్లో ఇంటర్​ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ఒత్తిడి ఉండటం సాధారణం. దీని నుంచి బయటపడటం చాలా ముఖ్యం. ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మెదక్​ డైట్​ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, మానసిక వైద్య నిపుణులు రమేశ్​ బాబు ఇలా వివరించారు.

మార్కులకు తగ్గుట్టుగా జవాబు :24 పేజీలతో కూడిన సమాధాన పత్రం ఇస్తారు. దాన్ని సరిగ్గా విభజించుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చివర్లో పేజీలు సరిపోలేదని హడావుడి పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు 8 మార్కుల ప్రశ్నకు ఒకటిన్నర, రెండు పేజీల్లో, 4 మార్కుల వాటికి ఒక పేజీలో, 2 మార్కుల ప్రశ్నకు 4 నుంచి 10 లైన్లలో సమాధానం రాయాలి. తద్వారా అన్ని పేజీలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుంటుంది.

గత ప్రశ్నపత్రాల సాధన :ప్రస్తుతం పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అందులోని ప్రధాన అంశాలను నోట్స్​లో రాసుకొని వాటిని రివిజన్ చేస్తుండాలి. ఒక్కో పాఠ్యాంశానికి ఓ రోజు కేటాయిస్తే మంచిది. కొత్త విషయాలను చదవొద్దు. ఇప్పటికే ప్రిపేర్ అయిన టాపిక్స్​ను చదువుతూ ఉండాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ఎంతో మేలు.

  • పరీక్షకు ఒక రోజు ముందే హాల్​టికెట్​, పెన్నులు, ప్యాడ్ తదితర వాటిని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
  • పరీక్షలో అన్ని సమాధానాలు రాసేలా ఇంటి దగ్గరే నిర్ధారించుకోవాలి. ఇందుకు అనుగుణంగా ఓసారి సాధన చేయాలి. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది.

తేలిక పాటి ఆహారం : పరీక్షకు వెళ్లే ముందు కచ్చితంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా పండ్లు తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ప్రస్తుతం మాంసాహారానికి, మసాల పదార్థాలు, మిఠాయి వంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిది. అందులోనూ పరీక్షకు ఒకటి, రెండు రోజుల ముందు అసలు తీసుకోవద్దు. అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎవరితో చర్చించొద్దు :పరీక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ప్రశ్నలు, సమాధానాలు ఎవరితో చర్చించొద్దు. పరీక్ష రాశాక తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేయొద్దు. ఇంటికెళ్లాక తదుపరి పరీక్షకు సంబంధించిన సబ్జెక్టులో ప్రధానాంశాలను చదువుకోవాలి. రాసి పెట్టుకున్న మెయిన్ పాయింట్స్​ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. చూడకుండా రాస్తే చాలా వరకు గుర్తుకుంటాయి. పరీక్షల సమయంలో తగినంత నిద్ర పోవడం ఎంతో ప్రధానం.

చదువుకునేలా ప్రోత్సహం :ఎంత బాగా సిద్ధమైనా ఆందోళనకు గురైతే అన్ని సమాధానాలు మరిచిపోయే అవకాశముంటుంది. ఆ రోజు పరీక్ష బాగా రాయలేదని బాధపడొద్దు. తదుపరి పరీక్షకు సిద్ధం కావాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. చదువుకునేలా ప్రోత్సహించాలి. ఏదైనా ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు మిత్రులతో గడపడం, కుటుంబీకులతో సరదాగా మాట్లాడటం వంటివి చేయాలి. లేదంటే కారమ్స్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడాలి.

ఎలాంటి ఆందోళన వద్దు :పరీక్షకు ముందు ఆందోళన చెందొద్దు. కేంద్రానికి హడావుడిగా వెళ్లొద్దు. కనీసం అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాక మిత్రులతో సంతోషంగా మాట్లాడాలి. పాఠ్యాంశానికి సంబంధించి చర్చించొద్దు. ఇక కేటాయించిన గదిలోకి వెళ్లి కూర్చొని ఇన్విజిలేటర్లు ఇచ్చిన సమాధానాల పత్రాన్ని నిశితంగా పరిశీలించాలి. చదివి కంగారు పడొద్దు. ఆలోచించుకోవాలి. బార్డర్స్‌ సిద్ధం చేసుకోవాలి.

  • తప్పులు లేకుండా హాల్‌టికెట్‌ నంబరును రాయాలి. ఒకటికి రెండు సార్లు చెక్​ చేసుకోవాలి.
  • ప్రశ్నపత్రం ఇచ్చాక క్షుణ్నంగా అన్నింటినీ చదవాలి. సమాధాన పత్రంలో బిట్‌ నంబరు, ప్రశ్న నంబరును సరిగ్గా రాయాలి. లేదంటే మనమెంత బాగా రాసినా వృథానే. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి.
  • త్వరగా సమాధానాలు రాసేసినా ఒకటికి రెండు సార్లు పరిశీలించి, తప్పులుంటే సరిచేసుకోవాలి.

పిల్లల పరీక్షల వేళ మారాల్సింది తల్లిదండ్రులే!

గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్ - ఇకపై ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్​లోకి

ఎగ్జామ్స్ టిప్స్ : పరీక్షలు బాగా రాయాలంటే - సెపరేట్ మెనూ ఫాలో అవ్వాల్సిందే

ABOUT THE AUTHOR

...view details