అవినీతి నిరోధక శాఖకు చిక్కిన కేశంపేట తహసీల్దారు లావణ్య పుట్టిన ఊరిలోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వారం క్రితం ఆమె తండ్రి నివాసంలో డీఎస్పీ ఆనంద్కుమార్, సీఐ వెంకటాచారితో కలిసి తొమ్మిది మంది అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కపూర్య తండాలో ఈ సోదాలు జరిగాయి. గడ్డిపల్లి ఎస్బీఐ శాఖలో 8 లక్షల 90 వేల నగదు ఈ మధ్యే జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు ఆమె తండ్రి పేరున ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల దస్త్రాలను అధికారులు సీజ్ చేశారు. లావణ్య తండ్రి వ్యవసాయదారుడు కావడం వల్ల సదరు నగదు ధాన్యం అమ్మగా వచ్చిందా... లేక ఇతర మార్గాల ద్వారా బ్యాంకులో జమ అయ్యిందా అన్న కోణంలో విచారణ సాగుతోంది.
సమాధానాలు దాటవేత
లావణ్య తొలిరోజు విచారణలో సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. కొందుర్గు వీఆర్వో అనంతయ్య తమ అక్రమ చిట్టా విప్పుతున్నట్లు సమాచారం. ఆమె పేరుతో ఉన్న రెండు బ్యాంకు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు...వీటిలో ఎంత డబ్బు ఉందనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఆయా బ్యాంకులకు లేఖ రాయనున్నారు.
ఇదీ చూడండి:చంద్రయాన్: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం