వరంగల్ బస్టాండులో ప్రయాణికులకు అడుగడుగునా ఇబ్బందులు స్వాగతం పలుకుతున్నాయి. రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న బస్టాండ్కి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. ఒకే మార్గంలో లోకల్, రూరల్ బస్సులు రావటంతో పాటు ప్రయాణ ప్రాంగణంలో నిలిచే వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ స్తంభిస్తోంది. ప్రయాణ ప్రాంగణం నుంచి బస్సు ముందుకు కదలాలన్న... లోపలికి రావాలన్నా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది.
ఇరుకుగా ఉండటంతో..
వరంగల్ ప్రాంగణం నుంచి జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలకు సర్వీసులను నడుపుతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, కాకినాడ, నర్సిపట్నంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు 400కు పైగా బస్సులను నడుపుతున్నారు. అయితే.. ఇంత రద్దీగా ఉండే బస్టాండు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో బస్టాండ్ మార్చాలని ప్రజాప్రతినిధులు నివేదికలు రూపొందించారు. కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. బస్టాండును ఆజంజాహి మిల్లు మైదానంలోకి తరలిస్తే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరువైన కనీస వసతులు
ప్రయాణ ప్రాంగణంలో వాణిజ్య దుకాణాలకు ఇచ్చిన ప్రాధాన్యాత ప్రయాణికులకు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండులో కనీస వసతులు కరువయ్యాయని తెలిపారు. కనీసం కూర్చోవటానికి కుర్చీలు లేవని... సిమెంటు దిమ్మెలు నిర్మించినా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఎటూ చూసినా చెత్తచెదారం ఉండి దుర్గంధం వస్తోందని చెప్పారు. ఇక తాగునీటి సౌకర్యం లేకపోవడంతో 5 రూపాయలు చెల్లించి కొంటున్నామని వివరించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్తుకు చేరిన బస్సు ప్రాంగణానికి మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు