హుజూర్నగర్ శాసనసభ ఉపఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. మండలానికో మంత్రి.. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించడంతోపాటు సర్వశక్తులను మోహరించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు వ్యూహరచన ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నల్గొండ ఎంపీగా గెలిచిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేయడం వల్ల ఆ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందనే భావనతో ఉత్తమ్ ఈ స్థానానికి తన సతీమణి పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించారు. అప్రమత్తమై తెరాస అధిష్ఠానం కార్యాచరణ ప్రారంభించింది.
రాష్ట్రంలో ఆది నుంచి తెరాసకు ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో ఇదొకటి కావడం వల్ల ఎలాగైనా ఈ నియోజకవర్గంలో విజయం సాధించి సత్తా చాటుకోవాలని పావులు కదుపుతోంది. 2018 ఎన్నికల్లో 7,460 ఓట్ల తేడాతో ఉత్తమ్ చేతిలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో తెరాస పనితీరు, పాలనపై ప్రజల మనోభావాలను తెలుసుకుంటోంది.
వెంటనే అభ్యర్థి ఎంపిక
అభ్యర్థిని వెంటనే ఎంపిక చేయాలని తెరాస అధిష్ఠానం భావిస్తోంది. సర్వే ఫలితాలతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, నియోజకవర్గ నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కార్యక్రమాలు ప్రారంభించాలని అధిష్ఠానం ఆదేశించింది. మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హుజూర్నగర్లో సభ నిర్వహించారు. ఆ సభలో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు తెరాసలో చేరారు.
మంత్రుల పర్యవేక్షణ.. ఎమ్మెల్యేల ప్రచారం
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు, రెండు పురపాలక సంఘాలున్నాయి. మండలానికొక మంత్రికి బాధ్యత అప్పగిస్తారు. అలాగే ఒక్కో పురపాలక సంఘాన్ని విడివిడిగా మంత్రులు పర్యవేక్షిస్తారు. ప్రధాన గ్రామాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రచారం చేయించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతోపాటు ఎన్నికల వ్యూహరచనలో ఆరితేరిన ఇతర నేతలను సైతం రంగంలోకి దింపనున్నారు.
ఇదీ చూడండి: నేడు శాసనసభలో పద్దుపై చర్చ