వానాకాలం 2020-21 సంవత్సరానికి సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వరి సేకరణ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఒక లక్ష 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ, హాకా ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 157 కేంద్రాల ద్వారా 7,404 మంది రైతుల నుంచి 31,681 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 3,710 మంది రైతులకు 30 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సన్న రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, లారీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యలు తలెత్తకుండా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు, లారీ యాజమాన్యాలు, అధికారులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, ఏపీడీ గోవిందరావు, ఇతర శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అప్పటి వరకు యూజీ కోర్సులు ప్రారంభించవద్దు'