దేశానికి ఛత్రపతి శివాజీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని.. శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్లో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.
శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాల వారిని సమానంగా చూసేవారని ఎంపీ పేర్కొన్నారు. శివాజీ సైన్యంలో మూడు వంతుల మంది ముస్లింలు ఉండేవారని.. ఎందరో ముస్లింలు ఉన్నత పదువులు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం, పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన శివాజీ చరిత్రను తెలుసుకొని.. ఈ తరం యువత ఎంతో నేర్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్లోని ప్రముఖ డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, సంఘ సేవకులకు సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో జాతీయ ఓబీసీ కమిషన్ మెంబర్ ఆచారీ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, శివాజీ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.