కొవిడ్-19 నివారణలో మహబూబ్నగర్ మహిళ గ్రామైక్య సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. బయటకు వెళ్తే మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు... అవసరమైన మాస్కుల తయారీని ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో తగినన్ని మాస్కులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు వాటిని తయారు చేస్తున్నాయి. ఇప్పటికే 50వేల మాస్కులను తయారు చేశారు. మరో లక్ష మాస్కులను సిద్ధం చేస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యుల... వ్యక్తిగత రక్షణ దుస్తులు పీపీఈలను తయారు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 250కి పైగా మహిళలు వాటి తయారీలో నిమగ్నమై ఉన్నారు.
పనులు దొరకడమే కష్టం..
నెల రోజులుగా లాక్ డౌన్...బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో పనులు దొరకడం కూడా కష్టమే. అలాంటి సమయంలో డీఆర్డీఏ మాస్కుల తయారీకి అవకాశం లభించిందని మహిళలు చెబుతున్నారు. ఒక్కో మాస్కు తయారీకి మహిళలకు ఐదు రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక పీపీఈలను తయారు చేసినందుకు ఇంకా ధర నిర్ణయించలేదు. జిల్లా మహిళా సమాఖ్య భవనంలో సుమారు 60 మంది పనిచేస్తుండగా... సుమారు 200 మంది మహిళలు ఇళ్ల నుంచి తయారు చేస్తూ... జిల్లా కేంద్రానికి పంపుతున్నారు. వీరికి కావాల్సిన వసతులను డీఆర్డీఏ అందిస్తోంది. తయారీకి కావాల్సిన పెట్టుబడిని జిల్లా అధికార యంత్రాంగం సమకూర్చుతోంది.
అన్నింటా...
మాస్కుల తయారీలోనే కాదు.. గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లలోనూ మహిళా సంఘాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో మహిళ సమాఖ్యలు కరోనా నివారణలో విధులు నిర్వహిస్తూ..తమ వంతు సాయం అందిస్తున్నాయి.
ఇవీ చూడండి: 22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్ గ్యాంగ్'