కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మావోయిస్టుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి హెచ్ఆర్ మేనేజర్ నుంచి డబ్బులు వసూలు చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. విచారణ తర్వాత ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ రమాకాంత్ ఆదివారం వివరాలను వెల్లడించారు.
నాయకురాలిగా చెప్పుకుంటూ..
హైదరాబాద్ బంజారా హిల్స్లో నివాసముంటున్న గోదావరిఖని రామగుండం ఐఎన్టీయూసీ నాయకురాలిగా చెప్పుకుంటున్న తాటిపాముల విజయలక్ష్మి సింగరేణిలోని లోతుపాతులు తెలుసుకుని దందాకు తెరలేపారు. ఈ వ్యవహారంలో మరికొందరిని చేర్చుకొని డబ్బులు ఎలా వసూలు చేయాలి, ఎవరెవరిని బెదిరిస్తే డబ్బులు వస్తాయో కూడా శిక్షణ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల మొదటి వారంలో విజయలక్ష్మి తన కారు డ్రైవర్ అయిన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండకు చెందిన మనోజ్ కుమార్తో కలిసి... సత్తుపల్లి సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ హెచ్ఆర్ మేనేజర్ జితేంద్రకు, ప్రాజెక్ట్ మేనేజర్కు, రామగుండంలోని క్యాంపస్ సంబంధించిన యజమానుల మేనేజర్ చరవాణిలకు ఫోన్ చేయించారు. తాము మావోయిస్టు పార్టీ వీరన్న అలియాస్ లచ్చన్న దళం అని చెప్పారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని, క్యాంపు మొత్తాన్నీ పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
బొమ్మ తుపాకులు చూపించి..
ఈనెల 5న నేరుగా కిష్టారం వై జంక్షన్ సమీపంలోని మహాలక్ష్మి క్యాంపుకు తన కారు డ్రైవర్తోపాటు మరో వ్యక్తిని పంపింది. మనోజ్ కుమార్ తన పేరు శ్రీకాంత్ అని పక్కన వచ్చిన వ్యక్తి మావోయిస్టు దళ కమాండర్ అని హెచ్ఆర్ మేనేజర్ పరిచయం చేసుకుని రూ.50 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. ఒరిజినల్ తుపాకులతో పోలి ఉన్న రెండు బొమ్మ తుపాకులు చూపించి బెదిరించి డబ్బులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వెళ్లారు. తిరిగి ఈనెల 11, 12 అర్ధరాత్రి వచ్చి జితేందర్ ఇచ్చిన ఐదు లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా మళ్లీ జితేంద్రకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటం వల్ల ఈనెల 15న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరుగుతున్న క్రమంలోనే మనోజ్ కుమార్ తన బావమరిది హరీశ్ను వెంటబెట్టుకుని.. ఈనెల 18న ఉదయం క్యాంపుకు వెళ్లి మరో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. బాధితుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుని పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.
పకడ్బందీగా అరెస్టు
సత్తుపల్లి ఎస్సై నరేష్ తన సిబ్బందితో బంజారాహిల్స్లో ఉన్న ప్రధాన నిందితురాలిని శనివారం పకడ్బందీగా అరెస్టు చేసి తీసుకువచ్చారని సీఐ తెలిపారు. కల్లూరు ఏబీసీపీఎం వెంకటేష్ టాస్క్ఫోర్స్ వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో ఇప్పటికే ఇద్దరు నిందితులను రిమాండ్ చేశారు. వారి నుంచి రెండు కార్లు, రెండు బొమ్మ తుపాకులు, రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సై నరేష్, సిబ్బంది లక్ష్మణ్, గోపాలకృష్ణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నకలీ వైద్యుడిని పట్టుకున్న పోలీసులు