ఉద్యోగాలపై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు ప్రశ్నించిన దాఖలాలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఎవరో వచ్చి అడిగితే చెప్పాల్సిన దుస్థితి తమకు లేదని మండిపడ్డారు. పీఆర్సీపై కమిటీ వేశామని త్వరలో సమస్య పరిష్కరిస్తామని తలసాని వివరించారు. సికింద్రాబాద్లోని జురాస్టియన్ ఫంక్షన్హాల్లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంపీ కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు.
అనవసర రాద్ధాంతం: కేశవరావు
తెరాస ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామాలు చేస్తామని రాజ్యసభ సభ్యుడు కేశవరావు స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ, ప్రమోషన్లపై ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఎప్పుడు ప్రశ్నించలేదు: గంగుల
ఐదేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్రావు మండలిలో ఉద్యోగాల గురించి ఎప్పుడు ప్రశ్నించలేదని మంత్రి గంగుల ఆరోపించారు. ఎమ్మెల్సీగా సురభి వాణీదేవిని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు.
విద్యారంగంపై అనుభవం ఉంది : వాణీదేవి, ఎమ్మెల్సీ అభ్యర్థి
పీవీ బిడ్డగా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి స్పష్టం చేశారు. విద్యారంగంతోపాటు అన్ని రంగాలపై తనకు అవగాహన ఉందన్నారు. తనకిష్టమైన విద్యారంగంలో ప్రజలకు సేవ చేయడం ఇదో మంచి అవకాశమని ఆమె తెలిపారు.