వానాకాలం పంట సీజన్ కోసం రైతుబంధు సాయాన్ని 15 నుంచి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని.. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో మొదలు పెట్టి రైతులందరికీ 10 రోజుల్లో సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు సాయం కింద రూ.7 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
కరోనా ఉద్ధృతి, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది. మార్చి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రావడంతో ఏప్రిల్ నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 6,500 కోట్లు దాటింది. ఏప్రిల్ నెలలో ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్డౌన్ నేపథ్యంలో వివిధ రంగాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఏప్రిల్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఓ మోస్తరు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు కొన్నాళ్ల పాటు నిలిచిపోవడంతో ఆ ఆదాయం వచ్చే అవకాశం లేదు. దీంతో పాటు ఇతర ఆదాయాలు కూడా తగ్గనున్నాయి. దీంతో మే నెలలో సర్కార్ ఖజానాకు ఆదాయం బాగా తగ్గింది.
ఓ వైపు ఆదాయం భారీగా తగ్గడం, మరోవైపు రూ.7 వేల కోట్లను రైతుబంధు కోసం చెల్లించాల్సి ఉంది. వేతన సవరణ అమలుతో నెలకు మరో వెయ్యి కోట్ల వరకు అదనపు భారం పడనుంది. దీంతో అవసరమైన నిధులు సమీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం.. రుణాలపై ఆధారపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.8,500 కోట్లను రుణంగా తీసుకొంది. తాజాగా మరో రూ.3 వేల కోట్లను అప్పుగా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు 30 ఏళ్ల కాలానికి రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. వాటిని ఈ నెల 15వ తేదీన వేలం వేయనున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పుల మొత్తం రూ.11,500 కోట్లకు చేరనుంది. ఈ ఏడాది 46 వేల 500 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి త్రైమాసికంలో మరో 600 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు