శనివారం కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల అమలుతో పాటు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడిగింపు, రాత్రి కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్.. ఒకటి రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించనున్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. తాజాగా కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించడంతో పాటు.. పలు మినహాయింపులు ప్రకటించింది.
ఆచితూచి అడుగులు వేయాలి...
రాష్ట్రంలో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుండగా.. దానినే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మెట్రో రైల్ సేవలు, అమ్యూజ్మెంట్ పార్కులు.. జిమ్లు, సినిమా హాళ్ల విషయంలో కేంద్రాన్ని అనుసరించనుంది.
చర్చించాకే నిర్ణయం
పాఠశాలలు, కళాశాలల పున: ప్రారంభంపై సీఎం చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతులకు తీపికబురు అందిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ నిర్ణయం ఏంటని రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వెల్లడించే అవకాశం ఉంది. అదేరోజు లాక్డౌన్, కరోనా నియంత్రణ సహా ఇతర అనుమతులు, ఆంక్షలకు సంబంధించిన నిర్ణయాలు వెల్లడిస్తారని ప్రచారం సాగుతోంది. రైతుల కీలక ప్రకటనలో ఇతర అంశాలు రాకూడదని భావిస్తే జూన్ 1న వెల్లడించే అవకాశం ఉంది.
ఇదీచూడండి: త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...