రాష్ట్రంలో బోధన ఫీజుల(engineering fees in telangana) చెల్లింపులో ర్యాంకు పరిమితి ఆంక్షలు బీసీ, ఈబీసీ విద్యార్థుల నాణ్యమైన చదువులకు అడ్డంకిగా మారాయి. మెరుగైన ఇంజినీరింగ్ కళాశాలలు, కోరుకున్న సీట్లకు వారు దూరమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా కళాశాలకు ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతించిన పూర్తి ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ర్యాంకుల పరిమితి నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఇంజినీరింగ్లో ప్రవేశాలు పొందుతున్నవారిలో కేవలం పూర్తిఫీజుల లబ్ధి 10-15 శాతం మందికి మాత్రమే దక్కుతోంది. ర్యాంకు పరిమితి దాటిన లక్ష మందికి పైగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఏటా ఫీజుల(engineering fees in telangana) కష్టాలు ఎదురవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు పిల్లలకు మంచి కళాశాలలో డిమాండ్ ఉన్న సీటు ఇప్పించేందుకు కోసం అప్పులు చేస్తున్నాయి.
ఎందుకీ సమస్య...?
బోధన ఫీజుల విధానం అమల్లోకి వచ్చిన తరువాత ర్యాంకులతో సంబంధం లేకుండా అందరికీ ఫీజులు మంజూరయ్యాయి. తరువాత ఎస్సీ, ఎస్టీలకు ఈ విధానం అమలు చేస్తూ బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ర్యాంకుల పరిమితి అమల్లోకి వచ్చింది. ఎంసెట్లో 10వేలు, ఈసెట్లో వెయ్యి ర్యాంకు సాధించిన విద్యార్థులకు కళాశాలలో ఎంత ఫీజు ఉంటే ఆ మొత్తం ప్రభుత్వమే బోధన ఫీజుల కింద చెల్లిస్తుంది. మిగతా వారికి రూ.35వేలు మాత్రమే ఇస్తుంది. అంతకు ఎక్కువ ఉంటే విద్యార్థులే ఆ ఫీజులు భరించాల్సి ఉంది. ఆరేళ్ల క్రితం ఫీజుల్లో తేడా స్వల్పంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కొన్ని పేరొందిన కళాశాలల్లో కోర్సు ఫీజు రూ.లక్ష పైనే ఉంటోంది. మంచి కళాశాలలో సీటు వస్తే రూ.35వేలు తీసివేయగా.. మిగతా మొత్తం చేతి నుంచి కట్టాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులు అమలవుతున్నా.. బీసీ, ఈబీసీలకు ఆ ఫలాలు అందడం లేదు.
అదనపు భారం రూ.400 కోట్లు
బీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్లో ర్యాంకు సీలింగ్ విధానాన్ని తొలగించాలని బీసీ సంక్షేమశాఖ మూడేళ్ల క్రితమే నివేదిక సిద్ధం చేసింది. ప్రతిఏటా సంక్షేమశాఖపై అదనంగా పడే బోధన ఫీజుల భారాన్ని అంచనా వేసి, ఏటా కనీసం రూ.200-300 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. ఈబీసీలకు బోధన ఫీజుల భారం మరో రూ.100 కోట్లు ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: Podu land issue in telangana: పోడు భూములపై శాటిలైట్ మ్యాప్.. ఆ వివరాలు పక్కాగా తేల్చేందుకే!