కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయకపోయినా ప్రైవేటు వ్యాపారులే కొంటున్నా... పంట ఉత్పత్తులకు కాస్త మంచి ధరలే పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారుల నిలువు దోపిడీకి గురవుతూ... మార్కెట్లో ఎంతో కొంత ధరకు పంటలు అమ్ముకునే రైతులకు ఈ సీజన్ ఒకరకంగా కలిసొచ్చింది. ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్లో ప్రత్యేకించి మిరప పంటకు ఉన్న ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వర్తకులు కాస్త ఎక్కువ ధరలు పెట్టి రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. తాజాగా మార్కెట్కు మిరప పోటెత్తుతుండటంతో ఒకరోజు ధర పెంచుతూ... మరో రోజు తగ్గిస్తున్నా మిరప ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలకు మించి రేట్లు లభిస్తున్నాయి.
వర్షాలు పడినా.. మంచి గిరాకీ
అక్టోబరులో కురిసన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గిపోవడంతో పంటలకు మార్కెట్లో గిరాకీ పెరిగిపోయింది. ఆ సమయంలో రైతులు భారీగా నష్టాలు చవిచూసినా కూడా మిగిలి ఉన్న పంటకు అనూహ్యంగా ధరలు లభిస్తుండటం పట్ల రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మలక్పేట మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన మిరప పంటకు మద్దతు ధరలకు మించి మంచి రేట్లు లభిస్తుండగా... గత రెండు మూడేళ్లతో పోల్చుకుంటే ఈసారి లాభసాటిగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఒక్కో రకానికి ఒక్కో ధర..
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ, ఒంగోలు, కర్నూలు.. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తదితర మార్కెట్లలో మిరప కొనుగోళ్లు చురుకుగా సాగుతున్నాయి. గురువారం ఒక్క రోజే గుంటూరు మార్కెట్కు 1,40,000 బస్తాల మిరప వచ్చింది. ఖమ్మం మార్కెట్కు 60 వేలు, వరంగల్కు 55 వేలు, హైదరాబాద్కు 7 వేలకు పైగా బస్తాల సరుకు అమ్మకానికి వచ్చింది. మలక్పేట సహా దాదాపు అన్ని మార్కెట్ యార్డుల్లో దాదాపు మీడియం తేజ ఎస్17 రకం క్వింటాల్ రూ. 14 వేలు, 334 సన్న రకం రూ. 11,500, బ్యాడ్గి 5,531, 668 రకాలు రూ.13 వేలు, 341 రకం రూ. 13,500, నంబర్ 5 రకం రూ. 12,500, డీడీ రకం రూ. 13,500 చొప్పున ధరలు పలికాయి. వరంగల్ ఎనమాముల మార్కెట్లో మోడల్ రేటు క్వింటాల్ రూ. 16 వేలు నిర్ణయించగా... వేలంలో సరుకు నాణ్యత ఆధారంగా రూ. 13 వేల నుంచి ఏకంగా 17,500 వరకు ధర పలికింది. అదే తాలు రకం మిరప తీసుకుంటే మోడల్ రేటు ఒక క్వింటాల్ రూ. 4 వేలు నిర్ణయించగా... రూ. 3 వేల నుంచి 5 వేల వరకు అమ్ముడుపోయింది. కరోనా కంటే ముందు 2019లో కూడా వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిరప ధర రూ. 14 వేల నుంచి 18,500 వరకు రైతులకు లభించడం విశేషం.
ఆశాజనకంగా మద్దతు ధరలు
గతంలో ఎండు మిరపకు కనీస మద్ధతు ధర లేదు. ఎంతోకాలంగా ఎమ్మెస్పీ పరిధిలోకి తీసుకురావాలని రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ... కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. అయినా డిమాండ్, సరఫరా మేరకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలో సగటు ధర క్వింటాల్కు రూ. 20 వేలకు పైగా పలికింది. మధ్యలో కాస్త తగ్గిపోయింది. మళ్లీ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎండు మిరప క్వింటాల్ గరిష్ఠ ధర ఏకంగా రూ. 22,500 పలికింది. తేజ రకానికి ఖమ్మంలో రూ. 14,300, ఎనమూముల మార్కెట్లో రూ. 12,500, మహబూబాబాద్ మార్కెట్లో రూ. 15,200 చొప్పున రైతులకు ధరలు లభించాయి. దీపిక రకం క్వింటాల్ ధర రూ. 15,500, వండర్ హాట్ రకం రూ. 15 వేలు, యూఎస్-31 రకం 14 వేల చొప్పున ధరలు పలికాయి.
మళ్లీ పండుగ తర్వాత మార్కెట్కు..
సీజన్లో భారీ వర్షాలు, వరదలకు మిరప మొదటి కోత పోయినా కూడా రెండు మూడు కోతల పంటకు మంచి ధరలు లభిస్తుండటంతో రైతులు సంతోషపడుతున్నారని వర్తకులు పేర్కొన్నారు. ఈ నెల 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29న హోళీ పర్వదినం సందర్భంగా సెలవుల దృష్ట్యా... మార్కెట్కు ఎండు మిరప రాక తగ్గవచ్చు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మళ్లీ పుంజుకోనున్నందున మే నెల వరకు సాగే సీజన్లో ఖమ్మం, వరంగల్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి సరుకు పోటెత్తనున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'