నిత్యం శాంతిభద్రతలు, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో పోలీసులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. కరోనా నియంత్రణలో భాగంగా మూడు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 24 గంటలపాటు షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు... వాహనదారులు, ప్రజలు బయట తిరగకుండా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
షిఫ్టులవారీగా విధులు
లాక్డౌన్ ప్రారంభరోజుల్లో పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహించారు. ఆ మరుసటి రోజు వాళ్లకు విశ్రాంతినిచ్చే వాళ్లు. పోలీసులు అలిసి పోతున్నారనే ఉద్దేశంతో.... ఉన్నతాధికారులు షిఫ్టులవారీగా విధులు కేటాయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 15వేల మంది పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న వారికి రోజు 12 గంటల పాటు విధులు కేటాయించారు. పలు చోట్ల తనిఖీ కేంద్రాలల్లో అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ముందుకు పంపిస్తున్నారు. అకారణంగా బయటికి వచ్చిన వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని జరిమానా విధిస్తున్నారు.
ఎండను లెక్కచేయకుండా..
నడి వేసవి సమీపిస్తున్న తరుణంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఠారెత్తిస్తున్న ఎండలను లెక్కచేయకుండా విధులను కొనసాగిస్తున్నారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా పోలీసులు రహదారులపైనే చేసేస్తున్నారు.
రోడ్లపైనే భోజనాలు..
కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా పోలీసులు కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం వేళల్లో కొందరు దాతలు అందించే అల్పాహారం, మంచినీళ్లు వంటివి రోడ్లపైనే సేవిస్తున్నారు. రాత్రి షిఫ్టులోకి పోలీసులు వచ్చే వరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు... ప్రభుత్వ సూచనలు పాటించాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే...