పెట్రో ధరల పెరుగుదలలో రాష్ట్ర ప్రభుత్వాలకూ భాగం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం కొంత పన్నులేస్తున్నట్టుగానే.. రాష్ట్రాలూ కొన్ని పన్నులు విధిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ పన్నుల తగ్గింపుపై రాష్ట్రాలు ఆలోచిస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలనుకుంటే రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో చర్చించాలని సూచించారు. ఇప్పటివరకూ ఏ రాష్ట్రమూ ఈ అంశాన్ని కౌన్సిల్ అజెండాలో చేర్చాలని కోరలేదని తెలిపారు.
సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపుపై వైకాపా, జేడీయూ లోక్సభాపక్ష నేతలు మిథున్రెడ్డి, రాజీవ్రంజన్సింగ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలూ కలిసి ఆలోచించాలి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో పన్ను రేటు ఉంది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని లోక్సభలోని సభ్యులకు అనిపించినప్పుడు దీనిపై కౌన్సిల్లో చర్చించాలని మీమీ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పండి. అందుకు సిద్ధమైతే మేం వచ్చే జీఎస్టీ కౌన్సిల్లోనే దీనిపై చర్చించడానికి సిద్ధం’ అని మంత్రి అనురాగ్సింగ్ఠాకూర్ తెలిపారు.
ఏపీకి ఇప్పటివరకు 587 కేజీబీవీలు
ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది జనవరి 11 వరకు 587 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు మంజూరుచేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. అందులో 499 విద్యాలయాలు నడుస్తున్నాయన్నారు. లోక్సభలో కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష యోజన కింద ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి గరిష్ఠంగా ఏటా రూ.లక్ష వరకు కాంపోజిట్ స్కూల్గ్రాంట్ ఇస్తున్నామని, ఇందులో కనీసం 10% మొత్తాన్ని పాఠశాలల స్వచ్ఛతకు వెచ్చించాలని సూచించారు.
ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. పరిహారానికి రెండు దశాబ్దాలు!