తెలంగాణలో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కొత్త పంట అందుబాటులోకి రాగా.. మహారాష్ట్ర నుంచి కూడా పంట నగరానికి దిగుమతవుతోంది. ఇలా ప్రస్తుతం మలక్పేట హోల్సేల్ మార్కెట్కు గురువారం 16,206 బస్తాలు అంటే 8,103 క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని గ్రేడ్-3 కార్యదర్శి నరేందర్ తెలిపారు. గతేడాది 40 శాతం పంట విస్తీర్ణం తగ్గగా.. కొంత వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. అయితే మహారాష్ట్ర రైతులు ప్రస్తుత పరిణామాలను ముందే ఊహించి వెంటనే రబీ పంటను ప్రారంభించారు. ఇప్పుడా దిగుబడులు మలక్పేట మార్కెట్కు వస్తుండటం వల్ల మూడు రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తెలంగాణలోని మహబూబ్నగర్, మెదక్ నుంచి వచ్చిన ఉల్లి రూ.30 నుంచి రూ.50 మధ్య విక్రయిస్తున్నారు.
నాలుగు ధరలు
హైదరాబాద్ ఎర్రగడ్డలోని మోడల్ రైతుబజార్లో వ్యాపారులు నాలుగు వేర్వేరు ధరల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీ ధరకు ఉల్లి కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయిస్తున్న రాయితీ ఉల్లి కోసం కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు.
అదే సమయంలో రైతుబజార్లోని స్వయం సహాయక బృందాల సభ్యులు మరో మూడు ధరల్లో ఉల్లిని అమ్ముతున్నారు. నాణ్యంగా, పెద్దగా ఉన్నవి కిలో రూ.70కి, కాస్త చిన్నవి రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక నాణ్యంగా లేని, తక్కువ రకం చిన్న గడ్డలను కిలో రూ.25కే విక్రయిస్తున్నారు. తాము కొనుగోలు చేసిన సరకును కొనుగోలుదారుల ఆసక్తిని బట్టి గ్రేడ్లుగా విభజించి విక్రయించాల్సి వస్తోందని స్వయం సహాయక బృందం సభ్యురాలు ఖైరున్నీసాబేగం చెప్పారు.
ఇదీ చూడండి : 12వేల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతికి కేంద్రం ఒప్పందం