రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరపున గళం విప్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని 15 రోజుల్లో నెరవేర్చకపోతే.. దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. తెరాస హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవా చేశారు. మంజీర, సింగూరు జలాలు దోచుకుపోయినా.. ఈ ప్రాంత ప్రజలు తెరాసనే గెలిపించారని, తెరాస ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన తెలిపారు. సంగారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికై సీఎంను కలిసి అడగాలనుకున్నా.. అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. అందుకే నేరుగా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి తుమ్మినా.. దగ్గినా.. బల్లలు కొట్టడం కాదు.. సమస్యలు పరిష్కారం చేస్తే బల్లలు చరచాలని తెరాస ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 40వేల మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల గురించి, సంగారెడ్డి మెడికల్ కళాశాల గురించి, సంగారెడ్డి ఆస్పత్రికి నిధులు కేటాయింపు గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు